విజయ్ వెళ్లొచ్చిన కొల్లూరు మూకాంబికా ఆలయం.. చూసొద్దామా: ఎలా వెళ్లాలి
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబికా దేవాలయం.. దక్షిణాదిన ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. పార్వతీదేవి ఇక్కడ మూకాంబికాగా పూజలందుకుంటోన్నారు. విద్యకు అధిష్ఠాన దేవతగా భావించే మూకాంబికా అమ్మవారిని దర్శించేందుకు కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పరశురాముడు సృష్టించిన ఏడు మోక్ష క్షేత్రాల్లో ఇది ఒకటిగా స్థానిక పురాణాలు చెబుతున్నాయి.
ఆకుపచ్చని పశ్చిమ కనుమల్లో వెలిసిందీ ఆలయం. ఇక్కడి అమ్మవారి విగ్రహం.. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే అయిదు పంచలోహాల సమ్మేళనంతో రూపొందింది. మూకాంబికా దేవిని మాట, అక్షరం, విద్యకు సంబంధించిన శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కూడా ఉంది.

కొల్లూరు మూకాంబికా దేవాలయం చరిత్ర
కొల్లూరు మూకాంబికా ఆలయ చరిత్ర సుమారు 1200 సంవత్సరాల నాటిదిగా భావిస్తారు. కాలక్రమంలో ఈ దేవాలయానికి అనేక రాజవంశాల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా కేలడి రాజవంశానికి చెందిన శంకన్న నాయక, శివప్ప నాయక వంటి పాలకులు ఆలయానికి విరాళాలు ఇచ్చి, పునరుద్ధరణ పనులకు సహకరించినట్టు చారిత్రక వివరాలు సూచిస్తాయి.
ఈ దేవాలయ స్థాపనకు ఆదిశంకరాచార్యులతో సంబంధం ఉందనే కథనం భక్తుల్లో బలంగా ఉంది. అద్వైత వేదాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన ఆదిశంకరాచార్యులు సరస్వతి దేవి పట్ల గొప్ప భక్తి కలిగిన తత్వవేత్తగా పేరుపొందారు. ఆయన భక్తికి ప్రసన్నమైన దేవి, తనకు ఆలయం నిర్మించాలని సూచించిందని పురాణగాథ చెబుతుంది.
పురాణాల ప్రకారం, ఆదిశంకరాచార్యులు మొదట ఈ అమ్మవారిని దేవిని కేరళకు తీసుకెళ్లాలని సంకల్పించారు. అమ్మవారు ఒక షరతు పెట్టిందట. తాను వెనుక నడుస్తానని, శంకరాచార్యులు ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తారో అక్కడే తాను స్థిరంగా నిలిచిపోతానని చెప్పిందట. కొంతదూరం వెళ్లిన తర్వాత మూకాంబికా అమ్మవారు వస్తున్నదా అని చూడాలనే ఆలోచనతో ఆయన వెనక్కి తిరిగారు. ఆ క్షణం నుంచే అమ్మవారు అక్కడే స్థిరంగా నిలిచిపోయారని పురాణ గాథ చెబుతుంది.
ఆదిశంకరాచార్యులు చేసిన ప్రార్థనల అనంతరం అమ్మవారు.. చొట్టానిక్కర ఆలయంలో ఉదయం నివసించి, మధ్యాహ్నానికి కొల్లూరుకు తిరిగి వస్తానని అనుగ్రహించిందనే సంప్రదాయ విశ్వాసం కూడా ప్రాచుర్యంలో ఉంది.
మూకాసుర వధతో కొల్లూరు మూకాంబికా మహిమ
కొల్లూరు మూకాంబికా ఆలయానికి సంబంధించిన మరో ప్రసిద్ధ పురాణం కౌమాసురుడు అనే రాక్షసుడి కథ. అపార శక్తులు పొందేందుకు అతడు ఘోర తపస్సు చేశాడట. ఆ శక్తులతో సమస్త లోకాలనూ ఏలాలనే అతని దుష్ట ఆలోచనను గ్రహించిన పార్వతి దేవి.. అతనికి మాట రాకుండా చేసిందని పురాణ కథనం చెబుతుంది.
మాట్లాడలేని స్థితికి వెళ్లిన కౌమాసురుడు తదనంతరకాలంలో మూకాసురుడిగా ఆవిర్భవించాడు. పార్వతి దేవి శక్తిరూపం ధరించి అతడిని సంహరించిందని విశ్వసిస్తారు. దీనివల్లే అమ్మవారిని మూకాంబికగా పిలుస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఆదిశంకరాచార్యులు ధ్యానం చేసిన అంబావనం ఇక్కడి కొడచాద్రి కొండల్లో ఉన్నాయని చెబుతారు.
కొల్లూరు మూకాంబికా దేవాలయం ప్రత్యేకతలు
మూకాంబికా దేవిని ఆది లక్ష్మి స్వరూపంగా, జీవరాశుల సృష్టికర్తగా, రక్షకురాలిగా భక్తులు భావిస్తారు. ఈ దేవాలయం శతాబ్దాలుగా శక్తి ఆరాధనకు ముఖ్య కేంద్రంగా కొనసాగుతోంది. ఇక్కడ అమ్మవారిని వాగ్దేవతగా పూజించడం ప్రత్యేకత. జ్ఞానం, ధైర్యం, సంపద కోసం భక్తులు మూకాంబికా దేవిని ప్రార్థిస్తారు.
ఈ ఆలయంలో దేవి శక్తి, శివ తత్వాల సమ్మిళితమైన జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తుందని విశ్వాసం. ఇక్కడ అమ్మవారిని పార్వతి, సరస్వతి, లక్ష్మి అనే మూడు రూపాల్లో పూజిస్తారు. జ్యోతిర్లింగం కుడి భాగం బ్రహ్మ, విష్ణు, శివులను సూచిస్తుందని, ఎడమ భాగం పార్వతి, లక్ష్మి, సరస్వతిని సూచిస్తుందని ఆలయ సంప్రదాయం చెబుతుంది.
కర్ణాటకలోని ఏడు ముక్తి యాత్రా క్షేత్రాల్లో కొల్లూరు మూకాంబికా ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆలయంలో అరుదైన పంచముఖ గణేశుని శిల్పం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. సౌపర్ణికా నది తీరంలోని గరుడ గుహలో సుపర్ణుడు, అంటే గరుడుడు, దేవిని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేశాడని నమ్మకం ఉంది.
కొల్లూరు మూకాంబికా ఆలయ పూజలు, ఉత్సవాలు
కొల్లూరు మూకాంబికా దేవాలయం దక్షిణాదిన ప్రముఖ యాత్రా కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి వచ్చే భక్తుల్లో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఉంటారు. భక్తులలో ఎక్కువ మంది కేరళకు చెందినవారు కాగా, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా నిరంతరం రాకపోకలు ఉంటాయి. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ ఆలయాన్ని దర్శించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా తరచూ మూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటుంటారు.
ఆలయంలో వార్షిక ఉత్సవాలు నవరాత్రి సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. అలాగే ఫాల్గుణ మాసంలో, మార్చి-ఏప్రిల్ కాలంలో వచ్చే మూల నక్షత్ర దినం అమ్మవారి జన్మదినంగా భావిస్తారు. ఆ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకునే భక్తులు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.
దేవాలయంలో ప్రతిరోజూ త్రికాల పూజలు జరుగుతాయి. తెల్లవారు జామున 5 గంటలకు నిర్మాల్య పూజ నిర్వహిస్తారు. ఈ సమయంలో స్వయంభూ లింగ దర్శనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ పూజా విధానాలు ఆదిశంకరాచార్యులు రూపొందించిన విజయాగమ పద్ధతి ప్రకారం కొనసాగుతున్నాయని ఆలయ సంప్రదాయం పేర్కొంటుంది.
మూకాంబికా అమ్మవారి విగ్రహం 'శ్రీ చక్ర యంత్రంలో ప్రతిష్ఠించిందని చెబుతారు. ఇది అమ్మవారి అత్యంత శక్తివంతమైన రూపంగా భక్తుల నమ్మకం. గర్భగుడి పశ్చిమ భాగంలో శంకర పీఠం ఉంది. కొల్లూరు మూకాంబికా ఆలయం చరిత్ర, పురాణం, శక్తి ఆరాధన, విద్యా సంప్రదాయాలను కలిపి నిలిచిన ముఖ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా కొనసాగుతోంది.
ఎలా వెళ్లాలి..
ఉడుపి జిల్లాలో ఉందీ ఆలయం. ఉడుపి నుంచి 65 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు. బెంగళూరు నుంచి 410 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి కేఎస్ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
కొల్లూరు క్షేత్రానికి దగ్గరలో ఉన్నది కుందాపురా రైల్వే స్టేషన్. బెంగళూరు నుంచి ఇక్కడికి నేరుగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కుందాపురా నుంచి కొల్లూరు 35 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలోనే వెళ్లాలి.
కొల్లూరుకు దగ్గరలో ఉన్నవి మంగళూరు, శివమొగ్గ విమానాశ్రయాలు. ఈ రెండింటి నుంచి కూడా రోడ్డు మార్గంలో కొల్లూరు క్షేత్రానికి చేరుకోవచ్చు.












Click it and Unblock the Notifications