పాక్, భారత్ కావు: కెసిఆర్ వ్యాఖ్యలపై బాబు ఫైర్
విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫాసిస్టుగా అభివర్ణించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రోజుకో వివాదం రేపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం అనకాల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్లో గవర్నర్కు అధికారాలను తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టడం దారుణమన్నారు. గవర్నర్కు అధికారాలు విభజన చట్టంలోనే ఉందని బాబు తెలియజేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇండియా- పాకిస్థాన్ దేశాలు కావని, కేంద్రం ఆదేశాలిస్తే మోదీని ఫాసిస్టు అంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విద్వేషాలు ఎంతగా రెచ్చగొట్టిినా తెలుగుజాతిని రక్షించే శక్తి తమ టిడిపికి ఉందని ఆయన చెప్పారు.
విభజనతో హేతుబద్దత లేకపోవడం వల్ల ఇరు రాష్ట్రాలకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. విభజనతో వచ్చిన నష్టాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందామని ఆయన కెసిఆర్కు సూచించారు.
ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఉదయం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అతి త్వరలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో కరువును పూర్తిగా నియంత్రిస్తామని, ఐదేళ్లలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కున్నామని, పార్టీ కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని కొనియాడారు. నేతలు పార్టీ మారినా కార్యకర్తలు తమ పార్టీతోనే ఉన్నారన్నారు. పదేళ్లుగా టిడిపి కార్యకర్తల కష్టాలు తనకు తెలుసని బాబు చెప్పారు. చేసిన తప్పుల వల్లే కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని వ్యాఖ్యానించారు.