అలా చేస్తే 2019లో అధికారం, కార్యకర్తలతో ఒక్క పూట భోజనం: చంద్రబాబు ఆఫర్
2019 ఎన్నికలకు టిడిపి సన్నాహాలు చేస్తోంది. తక్షణమే ప్రజల్లోకి వెళ్ళాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్యకర్తలను కోరారు.
విశాఖపట్టణం: 2019 ఎన్నికలకు టిడిపి సన్నాహాలు చేస్తోంది. తక్షణమే ప్రజల్లోకి వెళ్ళాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్యకర్తలను కోరారు. తొలుత స్థానిక సంస్థల ఎన్నికలు , ఆ తర్వాత లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. విజయసాధన కోసం పార్టీ యంత్రాంగం ఇప్పటి నుండే ప్రజల్లో ఉండాలని ఆయన కోరారు.
విశాఖ జిల్లాలో ప్రారంభమైన మహానాడు వేదికగా పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్దం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. 2019 ఎన్నికలకు ఇప్పటి నుండే పనిచేయాలని ఆయన సూచించారు.
నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల మన్ననలను పొందాలని ఆయన పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటికి పార్టీ చేసిన పనులను వివరించాలని ఆయన సూచించారు.
ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టిడిపికే ఒటువేసేలా చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. రానున్న రోజులన్నీ ఎన్నికలేనని ఆయన చెప్పారు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన సూచించారు.సమస్యల్లో ఉన్న ప్రజల వెంట ఉంటే ప్రజలు పార్టీ వెంటే ఉంటారని బాబు కార్యకర్తలకు సూచించారు.
సమస్యల్లో ఉన్నవారిని ఆదుకొంటే అధికారం మనదే
సమస్యల్లో ఉన్న ప్రజలను ఆదుకొంటే ఏ ఎన్నికలు వచ్చినా వారంతా పార్టీకే ఓటుచేస్తారని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రజల అవసరాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలను తీసుకోవాలని ఆయన కోరారు. అలా చేస్తే ఎన్నికల్లో ఓటర్లు వన్ సైడ్ గా ఓటుచేస్తారని బాబు కార్యకర్తలకు సూచించారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటుచేసినవారు కూడ పార్టీ క్యాడర్ చేసే సేవకు రానున్న ఎన్నికల్లో టిడిపికే ఓటుచేసేలా సేవ చేయాలన్నారు.ప్రజల్లో ఉన్నవారికే గుర్తింపు ఉంటుందన్నారు. పదవులకు అదే కొలబద్దగా మారుతోందని బాబు చెప్పారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాతి ఏడాది అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి.ఈ ఎన్నికలకు ఇప్పటి నుండే ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని ఆయన క్యాడర్ ను కోరారు.
ప్రజలకు ఆమోదయోగ్యమైనవారే నాయకత్వంలో ఉండాలి
సంస్థాగత ఎన్నికల్లో ఈ దఫా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన విషయాన్ని బాబు గుర్తుచేశారు. జిల్లా, గ్రామ, మండల కమిటీల్లో నాయకత్వ స్థానాల ఎంపిక విషయాల్లో కొత్త సంప్రదాయాలతో పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని బాబు చెప్పారు.ప్రజల్లో36 శాతం, కార్యకర్తల్లో 60 శాతం ఆమోదం లభిస్తేనే పార్టీ పదవుల్లోకి తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.పార్టీకి ఆమోదయోగ్యం కాని వారిని పార్టీ పదవుల నుండి తొలగించినట్టు చెప్పారు.సమర్థులకే పదవులు ఇవ్వనున్నట్టు బాబు ప్రకటించారు. పదవులు పొందినవారు ఎలా పనిచేస్తున్నారో సమీక్ష చేయనున్నట్టు చెప్పారు. ప్రతి కార్యకర్త కుటుంబం కోసం, పార్టీ కోసం పనిచేసేలా తయారుకావాలని ఆయన సూచించారు.
కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత
95 శాతం కార్యకర్తలు గౌరవాన్ని కోరుకొంటారని చంద్రబాబునాయుడు చెప్పారు. తనను నమ్ముకొని కార్యకర్తలున్నారన్నారు. తాను తన కుటుంబంతో గడిపే సమయం కంటే కార్యకర్తలతోనే ఎక్కువగా గడుపుతానని చెప్పారు. మంచివారిని ప్రోత్సహిస్తానని బాబు చెప్పారు. పార్టీ కార్యకర్తలు కొందరు తనను కలిసినప్పుడు పదవులు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తుననారు. అందరికీ అవకాశాలను కల్పించనున్నట్టు బాబు చెప్పారు.నీతి, నిజాయితీగా సంపాదించుకొంటే తప్పులేదన్నారు.అయితే అవినీతికి పాల్పడితే మాత్రం సహించేదిలేదన్నారు బాబు.
కార్యకర్తలతో ఒక్కపూట భోజనం
మీ కష్టాలు నేరుగా తనతో చెప్పుకోవాలని బాబు కార్యకర్తలను కోరారు. ఒక్కపూట తనతోనే భోజనం చేయాలని సూచించారు. సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని బాబు కార్యకర్తలకు బాబు భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకొంటున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కార్యకర్తలను బంధువుల్లా చూసుకొనే సంప్రదాయం ఒక్క టిడిపిలోనే ఉందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తలో సేవాభావం, సామాజిక భాద్యత పెరగాలన్నారు. అప్పుడే సమర్థనాయకుడిగా ఎదుగుతారని చెప్పారు.