రాజధాని అక్కడే!: మార్చేయాలని చంద్రబాబు ప్రణాళిక
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం పైన ప్రధానంగా దృష్టి సారించారు. విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఉంటుందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎపి రాజధానిని పెట్టుబడులకు, పర్యాటరంగానికి... ఇలా అన్నింటికి అనుకూలంగా మార్చాలని చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
రాజధాని ఎంపికపై ఆయన కసరత్తు తీవ్రం చేశారు. రాజధాని విషయంలో నిపుణులు, అధికారులు, పార్టీ నేతలతో చర్చలు ముమ్మరం చేశారు. సారవంతమైన నేల, జనసమ్మర్ధంతో కిటకిటలాడే కృష్ణా, గుంటూరు జిల్లాలను రాజధానికి ఎంపిక చేస్తే ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో వారంరోజులుగా చర్చిస్తున్నారు. గుంటూరు - విజయవాడ మధ్యే రాజధాని ఏర్పాటుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.
ఒకవేళ మంగళగిరిని ఎంపిక చేయకపోతే, విజయవాడకు సమీపంలోని ఆగిరిపల్లి, నూజివీడు లేదా బాపులపాడు వద్దనున్న అటవీ, ప్రభుత్వ భూములను రాజధానికి ఎంపిక చేయవచ్చునని అంటున్నారు. ఈ దిశగానూ కసరత్తు జరుగుతోందంటున్నారు. కేంద్రం నియమించిన రాజధాని ఎంపిక కమిటీ ఇంతవరకు నివేదిక ఇచ్చేందుకు మరో మూడు నెలలు పడుతుంది. అంతవరకు రాజధాని ప్రదేశాన్ని ఎంపిక చేయకుండా ఉండటం అంత సమంజసం కాదనే అభిప్రాయంతో బాబు ఉన్నారు.
విజయవాడ - గుంటూరు లేదా విజయవాడ- ఏలూరు మధ్య రాజధానిని ఎంపిక చేసే పక్షంలో 250 కిమీ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ రింగ్ రోడ్డు ఏలూరుకు సమీపంలోని గుండుగొలను వద్ద ప్రారంభమై నూజివీడు, ఆగిరిపల్లి, మైలవరం, కొండపల్లి, కంచికచర్ల మీదుగా చెవిటిపల్లి వద్ద కృష్ణా నది మీదుగా అమరావతి, అక్కడ నుంచి సత్తెనపల్లి, నర్సరావుపేట శివారు, చిలుకలూరి పేట మీదుగా బాపట్ల, తెనాలి, కొల్లూరు, అవనగడ్డ, గుడివాడ మీదుగా మళ్లీ గుండుగొలను వద్ద కలుస్తుంది.
రింగ్ రోడ్డును వెంటనే నిర్మించని పక్షంలో రాజధాని నిర్మాణం పూర్తైన తర్వాత గుంటూరు - విజయవాడ మధ్య విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తనున్నాయి. అందుకే రాజధాని నిర్మాణంతోపాటు రింగ్ రోడ్డును నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే గన్నవరం వద్ద చిన్నఅవుట్పల్లి నుంచి గొల్లపూడి మీదుగా మంగళగిరి వరకు 48 కిమీ బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రారంభించనున్నారు. రింగ్ రోడ్డు మరో 30 నెలల్లో పూర్తవుతుంది.
వచ్చే 50ఏళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రింగ్ రోడ్డు నిర్మిస్తే ఏలూరు, గుడివాడ, అవనిగడ్డ, రేపల్లె, తెనాలి, పొన్నూరు, బాపట్ల, చిలుకలూరిపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, కంచికచర్ల, మైలవరం పట్టణాలు విస్తరిస్తాయని నిపుణులు చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని గుంటూరు జిల్లా దాటకుండా వీలైనంత వరకూ రాజధానిని నిర్మించాలనే యోచనతో బాబు ఉన్నారు.