చంద్రబాబుకు షాక్: జగన్ పార్టీలోకి యలమంచిలి రవి, ఉమ అలర్ట్
విజయవాడ: యలమంచిలి రవి తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు.
తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని యలమంచిలి రవికి చెప్పాల్సిందిగా చంద్రబాబు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు సూచించారు. దీంతో దేవినేని ఉమా మహేశ్వర రావు మధ్యవర్తుల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

టిడిపి నుంచి వైసిపిలోకి యలమంచిలి రవి
తెలుగుదేశ పార్టీకి రాజీనామా చేసి యలమంచిలి రవి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీంతో నష్టనివారణ చర్యలకు తెలుగుదేశం నాయకత్వం నడుం బిగించింది.

ఇందుకోసం ఉమ
వచ్చే ఎన్నికల్లో కమ్మ ఓటర్లలో చీలిక రాకుండా చూడడానికి యలమంచిలి రవిని పార్టీ నుంచి వెళ్లకుండా జాగ్రత్తపడాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో యలమంచిలి రవిని ఆపాలని ఆయన దేవినేని ఉమకు చెప్పారు.

అనుచరులతో రవి సమావేశం...
తన అనుచరులతో యలమంచిలి రవి మంగళవారం సమావేశమయ్యారు. అయితే, ఆయన సమావేశానికి ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందినవారు హాజరయ్యారు. వారంతా పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి సన్నిహితులని సమాచారం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాపులు ఎక్కువ మంది ఉన్న దృష్ట్యా జనసేనలో చేరాలని వారు ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, రవి దానికి ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు.

ఈలోగా దేవినేని ఉమ సంప్రదింపులు..
తొందరపడి ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని దేవినేని ఉమ రవికి చెప్పించినట్లు సమాచారం. రవికి సన్నిహిత బంధువైన సిటి కేబుల్ ఎండి సాయిబాబతో దేవినేని ఉమ ఫోన్లో మాట్లాడి, రవికి నచ్చజెప్పాలని అడిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయిస్తానని రవికి చెప్పాల్సిందిగా ఉమ సాయిబాబతో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఆ సమావేశం ఉంటుందని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications