మహిళలకు ఉచిత బస్సుపై మరో బిగ్ ట్విస్ట్..! అచ్చెన్న షాక్ తో టర్నింగ్..!
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వచ్చే నెల 15 న ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మూడు నెలలుగా ప్రభుత్వం చెబుతూనే ఉంది. అయితే ఈ మూడు నెలల్లో చోటు చేసుకున్న పరిణామాలన్నీ ఓ ఎత్తయితే తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తుగా మారాయి. దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కథ మళ్లీ మొదటికొచ్చేసింది.
రాష్ట్రంలో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి పార్టీలు గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ లో భాగంగా హామీ ఇచ్చాయి. దీని ప్రకారం గతేడాదే ఇలా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాల్సి ఉంది. అయితే ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఉచిత బస్సు హామీ అమలు ఎప్పుడున్న చర్చ మొదలైంది. దీంతో ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పథకం అమలు కోసం కొత్త బస్సుల కొనుగోలు, జీరో టికెట్ విధానం వంటి చర్యలు చేపట్టారు.

అదే సమయంలో ఆగస్టు 15 నుంచి జిల్లా పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు మహిళలకు అవకాశం కల్పించబోతున్నట్లు చంద్రబాబు తాజాగా శ్రీశైలం పర్యటనలో చెప్పేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాకుండా జిల్లాల వరకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తేలిపోయింది. అదే సమయంలో కొత్త జిల్లాల పరిధిలోనే ఇలా ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తారా లేక ఉమ్మడి జిల్లాల పరిధిలో అవకాశమిస్తారా అన్న చర్చ మొదలైంది. ఈ చర్చ సాగుతుండగానే తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు అన్నవరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని చెప్పేశారు. దీంతో ఎన్నికల హామీని యథాతథంగా నిలబెట్టుకుంటారన్న సంతోషం మహిళల్లో వ్యక్తమైంది.
అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే అని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పేసిన తర్వాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ పథకం అమలుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు కూడా చెప్పారు. దీంతో వారు ఆ ఏర్పాట్లలో ఉండగానే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో తిరిగి జనంలో ఆశలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అచ్చెన్న చెప్పిన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలా లేక కొత్త జిల్లాల పరిధిలోనా, సరిహద్దులు మార్చాక ఆ పరిధిలో అమలు చేయాలా లేక ఉమ్మడి జిల్లాల పరిధిలో అమలు చేయాలా అన్న అనుమానం ప్రభుత్వంలో మొదలైంది.

ఇప్పటికీ అధికారులు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగానా లేక జిల్లాల పరిధిలోనా, ఏ జిల్లాల ప్రాతిపదికన దీన్ని అమలు చేస్తారన్న విషయాలపై నోరు మెదపలేని పరిస్ధితి. దీనికి కారణం ప్రభుత్వం ఈ పథకం అమలు పరిధిని కచ్చితంగా నిర్ణయించకపోవడమే. ఆగస్టు 15న పథకం అమలు చేయాల్సి ఉండగా.. కేవలం 18 రోజులు మాత్రమే మిగిలున్న పరిస్ధితుల్లో ప్రభుత్వం ఇంకా ఉచిత బస్సుపై తేల్చకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సింగపూర్ టూర్ నుంచి రావాలన్నా మరో నాలుగు రోజులు పడుతుంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నా అమలు చేసేందుకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ పథకం అమలుతో నష్టపోయే ఆటో డ్రైవర్లకు పరిహారంగా ఎంత మొత్తం చెల్లిస్తారన్న దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో అటు మహిళలతో పాటు ఇటు ఆటో డ్రైవర్లు కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications