జగన్ వదిలేసిన ఆ భారీ ప్రాజెక్టుకు మళ్లీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత ఓ కీలకమైన ప్రాజెక్టు చేపట్టింది. ఇక్కడి మధ్యతరగతి కోసం చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టును ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ నిలిపేసింది. చంద్రబాబు ప్రాజెక్టు అన్న కారణంతో జగన్ దీన్ని పక్కనబెట్టేశారు. ఇప్పుడు తిరిగి కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అమరావతిలో మధ్యతరగతి ప్రజల నివాసం కోసం హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును అప్పట్లో టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. అప్పట్లో రూ.700 కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదనలతో దీని నిర్మాణం ప్రారంభించారు. అయితే వైసీపీ చేతికి అధికారం రాగానే దీనికి బ్రేకులు వేసింది. దీంతో గత కొన్నేళ్లుగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. తిరిగి కూటమి అధికారంలోకి రావడంతో తాజాగా సీఆర్డీఏ సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణం తిరిగి ప్రారంభించేందుకు ఆమోదం తెలిపారు.

ఈ నేపథ్యంలో తాజాగా సవరించిన అంచనాల ప్రకారం రూ.930 కోట్ల బడ్జెట్ తో ఈసారి దీన్ని చేపట్టబోతున్నారు. అలాగే వైసీపీ సర్కార్ మధ్యలో నిలిపేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు రూ.200 కోట్లకు పైగా పెరిగిన అంచనా వ్యయాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. దీంతో ఈ మొత్తాన్ని హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించబోతోంది. దీంతో త్వరలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సీఆర్డీఏ టెండర్లు పిలువబోతోంది. ఇందులో మొత్తం 1200 ప్లాట్లు నిర్మిస్తారు.












Click it and Unblock the Notifications