పంచాయతీ వార్ : చంద్రబాబు మ్యానిఫెస్టోపై వైసీపీ ఎదురు దాడి .. కాపీల రాయుడు అంటూ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికలలో టిడిపి బలపరిచిన అభ్యర్ధులను గెలిపించాలని, ఒకవేళ వారు గెలిస్తే సమర్థవంతమైన పాలన అందిస్తారు అంటూ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పల్లె ప్రగతి పంచ సూత్రాల పేరుతో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై వైసిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా, చంద్రబాబుపై ఎదురు దాడికి దిగుతుంది.

చంద్రబాబు వైసీపీ హామీలను కాపీ కొట్టారని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు
పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలలో టిడిపి మేనిఫెస్టో రిలీజ్ చేయడం ఎన్నికల నిబంధనలకు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమంటూ వైసిపి ఫిర్యాదు చేసింది. అంతేకాదు పంచాయతీ ఎన్నికల కోసం విడుదల చేసిన మేనిఫెస్టో పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టి తమ హామీలు గా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించుకున్నారు అంటూ వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

మ్యానిఫెస్టోలోని ప్రతి అంశానికి కౌంటర్ వేస్తున్న వైసీపీ
కాపీల రాయుడు చంద్రబాబునాయుడు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.
ఇక చంద్రబాబు పల్లె ప్రగతి పంచ సూత్రాల పేరుతో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ఉద్దేశించి తమదైన వివరణలు కూడా ఇస్తున్నారు వైసిపి నాయకులు. టిడిపి బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే గ్రామాలలో నిరుపేదలైన ప్రతి కుటుంబానికి 100 గజాల్లో మూడు లక్షల ఇళ్లు నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు . ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసి, వారి ఇళ్లను కూడా నిర్మించి ఇచ్చే బాధ్యతను చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఉచిత నీటి కుళాయిల హామీ కూడా వైసీపీ అమలుకు శ్రీకారం చుట్టిన పథకమే
ఇదే సమయంలో చంద్రబాబు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి ,నీటి కుళాయిలను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే ఇప్పటికే వైసీపీ సర్కార్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయిలను కూడా ఏర్పాటు చేసే కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని ఈ హామీ కూడా, చంద్రబాబు వైసీపీ నుంచి కాపీ కొట్టిందే అంటూ ప్రచారం చేస్తున్నారు.

కొత్తదనం లేని చంద్రబాబు హామీలు అంటూ విమర్శలు
మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని మరోమారు డ్వాక్రా మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అయితే ఇప్పటికే వైసీపీ సర్వే ఆసరా పథకాన్ని అమలు చేస్తూనే పొదుపు సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలను కూడా అందిస్తుంది. ఇక చంద్రబాబు ప్రకటించిన ఈ హామీలో కూడా కొత్తదనం లేదని, జగన్ అమలు చేస్తున్న హామీని తిరిగి చంద్రబాబు ప్రకటించారు అంటూ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పల్లె ప్రగతి పంచ సూత్రాలలో కొత్తదనం లేదని ప్రచారం చేస్తున్నారు .
Recommended Video

చంద్రబాబు వ్యూహానికి వైసీపీ ప్రతివ్యూహం
ఇలా చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని అంశాలు ప్రస్తుతం వైసిపి అమలు చేస్తున్న పథకాలేనని, వైసీపీ ఇచ్చిన హామీలను తిరిగి చంద్రబాబు అమలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు చంద్రబాబు మేనిఫెస్టో ను తూర్పార పడుతున్నారు. కాపీల రాయుడు చంద్రబాబు నాయుడు అంటూ ప్రచారం మొదలెట్టేశారు . ఏదేమైనప్పటికీ పంచాయతీ ఎన్నికలలో, గ్రామాలలోని ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం చంద్రబాబు, చంద్రబాబు ఎత్తులను చిత్తు చేసే పనుల వైసిపి వ్యూహ, ప్రతివ్యూహాలతో ఎన్నికల పోరును రసవత్తరంగా మార్చారు.












Click it and Unblock the Notifications