జగన్కు, కేసీఆర్కు బాబు చురకలు, విలేకరిపై ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నానని చెప్పారు. కొందరు రాజకీయం కోసమే తమ పైన విమర్శలు చేస్తున్నారన్నారు. రుణమాఫీతో ఏపీ రైతులు తమ వెంటే ఉన్నారని చెప్పారు.
ఓ వ్యక్తి ఆందోళనలు చేస్తారట అంటూ జగన్ పైన విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలోను వారు రుణమాఫీకి అనుకూలంగా లేరని చెప్పారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి రుణమాఫీ మంచిది కాదని అభిప్రాయపడ్డారంటూ చంద్రబాబు ఆయన చెప్పిన మాటలను చదివి వినిపించారు. తాము ఇచ్చినమాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామన్నారు.
అనంతపురం జిల్లా కరువు జిల్లా అని, అందుకే ఆ జిల్లాకు హంద్రీనీవా నీటిని తీసుకు వచ్చామని చెప్పారు. తాము ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రుణమాఫీ చేస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాలకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఓ పక్క కొత్త రాష్ట్రం, సవాలక్ష సమస్యల ఉన్నాయని, ఆదాయం లేదని, పెట్టుబడులు రావాల్సి ఉందని, పరిశ్రమలు తీసుకు రావాలని అన్నారు.
ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తాను ఒకరి పైన నెపం వేయడం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణలో ప్రతి సమస్యకు కేసీఆర్, తెరాస ప్రభుత్వం చంద్రబాబు పైన నెపం నెడుతోందని టీడీపీ నేతలు ఎప్పటి నుండో చెబుతున్నారు.
తాను తన తెలివి తేటలను ఉపయోగించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తానని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని కాపాడతానన్నారు. తాను రుణమాఫీ ఎలా చేస్తావని కొందరు ప్రశ్నించారని, అలాంటి వారు రుణమాఫీకి వ్యతిరేకమని జగన్ను ఉద్దేశించి అన్నారు. దీనిని ఏ పార్టీ కూడా ఒప్పుకోలేదని, కానీ తాము రైతుల కష్టాలు తీర్చేందుకు రుణమాఫఈ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.1 రుణమాఫీ చేస్తే తాము లక్షన్నర చేస్తున్నామన్నారు.
విలేకరికి చురకలు
రుణమాఫీ ప్రకటన సందర్భంగా అరకొర సమాచారంతో తనను ప్రశ్నించిన విలేకరిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కలు రాకుంటే నేర్పుతాను రమ్మంటూ ఆయన సదరు మీడియా మిత్రుడికి షాకిచ్చారు. రైతు రుణాలను మాఫీ చేసేందుకు సంబంధించి సిద్ధం చేసిన విధాన ప్రకటనను వివరిస్తున్న సందర్భంగా ఓ విలేకరి రైతుల సంఖ్యపై చంద్రబాబును ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాం నాటి రైతుల సంఖ్యను చెబితే, దానిని ప్రస్తుత సంఖ్యగా ఎలా పరిగణిస్తారని చంద్రబాబు ఆ విలేకరిని నిలదీశారు. అసలు మీరు చెబుతున్న లెక్క ఎక్కడుంది? ఏపీలో ఉందా? ఉంటే ఏ జిల్లాలో ఉంది? మీకు లెక్కలు రావేమో... రండి నేర్పుతానంటూ కాస్త ఘాటుగా స్పందించారు.