భూమా కుడిభుజంకు జగన్ పార్టీ పిలుపు: అఖిలపై చంద్రబాబు సీరియస్?
మంత్రి భూమా అఖిలప్రియపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి మృతి అనంతరం ఆమెకు మంత్రి పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చారు.
కర్నూలు: మంత్రి భూమా అఖిలప్రియపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి మృతి అనంతరం ఆమెకు మంత్రి పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చారు.
అఖిలప్రియ చక్రం: శిల్పాకు వైసిపి కాటసాని షాక్, జగన్ హామీపై ట్విస్ట్
కానీ ఆమె ఎవరినీ కలుపుకొని వెళ్లడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నిన్న శిల్పా మోహన్ రెడ్డి, నేడు భూమా ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మంత్రిపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. దీంతో చంద్రబాబు ఆమె తీరు పట్ల సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది.
అఖిలతో చిర్రెత్తి వైసిపిలోకి శిల్పా మోహన్ రెడ్డి
భూమా నాగిరెడ్డి మృతి తర్వాత నంద్యాల టిక్కెట్పై శిల్పా మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. కానీ భూమా మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. శిల్పా కూడా పట్టుబట్టడంతో ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ ఈ లోపే నంద్యాల నియోజకవర్గంపై అఖిల దూకుడుగా వ్యవహరించారని అంటున్నారు. దీంతో చిర్రెత్తిన శిల్పా వైసిపిలో చేరారు. శిల్పాకు భూమా కుటుంబానికి రాజకీయ వైరం ఉన్న కారణంగా అధిష్టానం దీనిపై కొంత సర్దుకుంది.
అఖిలపై భూమా కుడిభుజం నిరసన గళం
అయితే ఇప్పుడు ఏకంగా భూమాకు ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డినే అఖిలప్రియపై నిరసన గళం విప్పారు. దీంతో అఖిలప్రియ తీరుపై అధిష్టానం గుర్రుగా ఉందని తెలుస్తోంది. ఈ కారణంగానే రేపు (శనివారం) కర్నూలు జిల్లా నేతలను అమరావతికి రావాలని చంద్రబాబు హుకూం జారీ చేశారు.
ఎవరీ ఏవీ సుబ్బారెడ్డి?
ఏవీ సుబ్బారెడ్డి భూమాకు ప్రధాన అనుచరుడు. భూమాకు తాను కుడిభుజంలా ఉండేవాడినని చెప్పారు. భూమా మద్దతుతో నంద్యాలలో భూమా వర్గాన్ని తానే తయారు చేశానని చెప్పారు. భూమా తనను ఒరేయ్ అంటే... ఏం గురు అని అనే వాడినని చెబుతున్నారు. తాను అప్పుడు, ఇప్పుడు ఎలాంటి పదవి ఆశించలేదని చెప్పారు.
అఖిలతో కళా వెంకట్రావు భేటీ
ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు గురువారం సాయంత్రం మంత్రి అఖిలప్రియతో భేటీ అయ్యారు. శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారటం, తాజాగా ఏవీ సుబ్బారెడ్డి అసంతృప్తి నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏవీ సుబ్బారెడ్డికి జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిలుపు వచ్చింది. కానీ ఆయన ఉప ఎన్నికల వరకు భూమా కుటుంబంతోనే ఉంటానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదంటున్నారు.