జగన్ అసమర్ధత వల్లే ఈ దుస్థితి;ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని చూడలేదు: చంద్రబాబు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిడిపి 40 ఏళ్ల ప్రస్థానం లోగో ఆవిష్కరించిన చంద్రబాబు రాష్ట్రంలో తాజా పరిస్థితిపై నిప్పులు చెరిగారు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న వరుస మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.

సీఎం అసమర్థత వల్లే పోలవరానికి ఈ దుస్థితి
సీఎం అసమర్థత వల్లే పోలవరానికి ఈ దుస్థితి వచ్చిందని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. పోలవరంలో మిగతా 40 వేల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం భరిస్తుందా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ ఎప్పటిలోగా పూర్తి చేసి నీళ్లు ఇస్తారో జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. 2023లో పోలవరం నుండి నీళ్ళు ఎలా ఇస్తారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ప్రజల్లోకి వైసీపీ పాలనా వైఫల్యాలను బలంగా తీసుకెళతాం
నాటుసారా మరణాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన చంద్రబాబు, ప్రభుత్వం చర్చ జరపడానికి ఎందుకు సిద్ధపడలేదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నిర్వహిస్తున్న అక్రమ మద్యం వ్యవహారాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో 3 రాజధానులపై సీఎం మాట్లాడి, మరోసారి మూడుముక్కలాటకు తెర తీశారని ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తుపై వైసిపి ప్రభుత్వం విషం చిమ్ముతోంది అంటూ మండిపడ్డారు.

నీతిమాలిన చీకటి వ్యాపారం కోసం ఏపీ ప్రభుత్వ దుర్మార్గం
ఇక ఏపీలో మద్యం వ్యవహారంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, నీతిమాలిన చీకటి వ్యాపారం కోసం ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటుందని చంద్రబాబు విమర్శించారు . తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ స్థాపించారని పేర్కొన్న చంద్రబాబు కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు వెల్లడించారు.

పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని పేర్కొన్న చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని పేర్కొన్న చంద్రబాబు వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications