బిజెపితో చంద్రబాబు కటీఫ్: మోడీ మంత్రివర్గం నుంచి ఔట్?
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాయత్తమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఏదో ఒక కారణం చెబుతూ కేంద్రంతో సయోధ్య కొనసాగిస్తూ వచ్చారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదనే భావనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంత జరిగాక కూడా స్నేహం కొనసాగిస్తే అసలుకే మోసం వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రత్యేక హోదా ఆలోచనే కేంద్రానికి లేదని, అందుకు వీలుగా 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టం చేయడంతో భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు దృష్టి పెట్టారు.
అయితే, కాస్తా తిరకాసు కూడా చంద్రబాబు పెట్టే అవకాశం ఉంది. కేంద్రానికి మద్దతు కొనసాగిస్తూనే మంత్రివర్గం నుండి మాత్రం తాము తప్పుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. వివాదం ముందుకు వచ్చిన ప్రతిసారీ కేంద్ర మంత్రులు కూడా ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో ఉందని, కేంద్రం తిరస్కరించలేదని కూడా చెబుతూ వచ్చారు.
తాజాగా కేంద్రం చేతులు ఎత్తేయడంతో వ్యూహాత్మంగా వ్యవహరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బిజెపి మంత్రులను కొనసాగించినా, కేంద్రంలోని క్యాబినెట్ నుండి మంత్రులను తప్పించడం అనివార్యమనే భావనకు ఆయన వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం కేంద్రంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురు మంత్రులున్నారు. అందులో ఇద్దరు తెలుగు దేశం పార్టీ వారు కాగా, మరో ముగ్గురు బిజెపికి చెందిన వారు. ఎం వెంకయ్యనాయుడు, పి అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి మంత్రులుగా ఉన్నారు.
వీరిలో పి అశోక్ గజపతి రాజును, సుజనా చౌదరిని మంత్రిపదవుల నుండి రాజీనామా చేయించడం ద్వారా రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి పెంచాలని చంద్రబాబు చూస్తున్నట్టు సమాచారం. తద్వారా ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పినట్లు కూడా అవుతుందని ఆయన అనుకుంటున్నారు.
కేంద్ర మంత్రి వర్గం నుంచి తన పార్టీ మంత్రులను ఎందుకు తప్పించడం లేదని జగన్ చాలా కాలంగా అడుగుతూ వస్తున్నారు. దాంతో జగన్కు సమాధానం చెప్పడం, కేంద్రంపై ఒత్తిడి పెంచడం అనే రెండు ప్రయోజనాలు నెరువేరుతాయని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.