వార్ రూమ్ దేనికి, ఎవరి మీద యుద్ధం: కెసిఆర్పై బాబు
హైదరాబాద్: రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు, అభివృద్ధిలో పోటీ పడాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సూచించారు. ఆయన శనివారంనాడు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. వారిరువురి మధ్య గంటన్నర పాటు మంతనాలు సాగాయి.
గవర్నర్తో భేటీ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్పై దెబ్బ పడిందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి తమకు ముఖ్యమని ఆయన అన్నారు. తాను ఎంతో కష్టపడడం వల్లనే తెలంగాణ మిగులు బడ్జెట్ను సాధించిందని ఆయన అన్నారు.
ప్రతిపక్షంలో కాస్తా అటూ ఇటుగా మాట్లాడినా అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. అన్నదమ్ముల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూడడం దుర్మార్గమని ఆనయ అన్నారు. విడిపోయినా కలిసుండి సుఖపడాలని ఆయన సూచించారు.

యావద్దేశం మోడీపై విశ్వాసం ఉంచిందని ఆయన అన్నారు. సమస్య పరిష్కారంలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తానని మోడీ హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాలకూ న్యాయం జరగాలని, న్యాయం జరిగిందని ప్రజలు నమ్మే పరిస్థితి రావాలని ఆయన అన్నారు. ఈ నెల 26వ తేదీన మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని ఆయన చెప్పారు.
తిరుపతిలో భూకబ్జాలు జరిగాయని, పదేళ్లుగా ఎర్రచందనం స్మిగ్లింగ్ జరుగుతోందని ఆయన అన్నారు. అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మంచి రోజు చూసుకుని తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన చెప్పారు.
తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరాలను స్వీకరించడానికి తెరాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్ రూమ్పై చంద్రబాబు మండిపడ్డారు. వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరి మీద యుద్ధం చేయడానికి ఆయన ప్రశ్నించారు. అవసరమైతే వార్ రూమ్కు తాను వెళ్లి మాట్లాడుతానని ఆయన అన్నారు. కాంగ్రెసు వార్ రూమ్ ఏర్పాటు చేసి భ్రష్టు పట్టిందని ఆయన అన్నారు. కెసిఆర్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు












Click it and Unblock the Notifications