సీమాంధ్రలో కెసిఆర్పై విసుర్లు: బాబు వ్యూహం?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సీమాంధ్ర ఎన్నికల్లో తెరాస లేకపోయినప్పటికీ, అక్కడ ఆ పార్టీ ప్రత్యర్థి కాకపోయినప్పటికీ చంద్రబాబు కెసిఆర్ను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు వరుసగా ప్రజాగర్జన పేర బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటి వరకు చంద్రబాబు ఒకే ఒక్క ప్రజాగర్జన బహిరంగ సభలో పాల్గొన్నారు. మహబూబ్నగర్లో నిర్వహించిన ఆ ప్రజాగర్జన సభలో కెసిఆర్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో కెసిఆర్పై, తెరాసపై విమర్సలు చేశారంటే ఆర్థం చేసుకోవచ్చు కానీ సీమాంధ్రలో ఇంతకు ముందు జరిగిన బహిరంగ సభల్లోనే కాకుండా బుధవారం శ్రీకాకుళంలో జరిగిన బహిరంగ సభలో కూడా కెసిఆర్పై విమర్సలు చేయడంలోని వ్యూహం ఏమిటనేది అర్థం కావడం లేదు.
కెసిఆర్ తన వద్దనే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారని ఆయన వరుసగా చెబుకుంటూ వస్తున్నారు. కెసిఆర్ను వసూల్ రాజాగా అభివర్ణిస్తున్నారు. దీనికితోడు, హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని, తెలంగాణకు తాను న్యాయం చేశానని ఆయన అంటూ వస్తున్నారు. తాను విభజనను వ్యతిరేకించలేదని, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరానని, కానీ కాంగ్రెసు అలా చేయలేదని ఆయన అంటున్నారు.
తెలంగాణలో రామబాణం వదిలానని, బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పానని ఆయన చెప్పుకుంటున్నారు. కెసిఆర్ విషయం గానీ, తెరాస విషయం గానీ సీమాంధ్ర ప్రజలకు అవసరమా అనేది ప్రశ్న. అలాగే, తెలంగాణ విషయాన్ని సీమాంధ్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏముందనేది కూడా ప్రశ్ననే. అయితే, హైదరాబాదును అభివృద్ధి చేసినట్లుగా తనకు అధికారం ఇస్తే సీమాంధ్రను అభివృద్ధి చేస్తాననే సంకేతాలను ఆయన ప్రజలకు ఇస్తున్నారని అనుకోవచ్చు. అలాగే, కెసిఆర్ వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని, తన ప్రమేయం లేదని చెప్పడం కూడా ఆయన మాటల్లోని ఆంతర్యం కావచ్చు. కానీ, చంద్రబాబు ప్రసంగాల్లో వైవిధ్యం లోపించిందని మాత్రం అభిప్రాయ పడుతున్నారు.