నేడు ఢిల్లీకి చంద్రబాబు; పొత్తులపై బీజేపీ అగ్రనేతలతో భేటీపై ఉత్కంఠ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇక ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని, కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించాలని ఏపీలో రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించిన పక్కా ప్లాన్ తో దూసుకుపోతుంటే, టిడిపి అధినేత చంద్రబాబు ఈసారి ఎలాగైనా ఏపీలో అధికార వైసీపీని గద్దె దింపాలని కంకణం కట్టుకున్నారు.
అందులో భాగంగా ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళుతున్నారు. మరోవైపు జనసేన అటు టీడీపీతో ఇటు బీజేపీ తో పొత్తులలో ఉంది. తాజా పరిస్థితులలో వైసీపీని అధికారం నుండి దింపడం కోసం కలిసొచ్చే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సై అంటున్నారు. ఇక ఈ క్రమంలోనే చంద్రబాబు తాజాగా నేడు ఢిల్లీ వెళుతున్నారు.

పొత్తులపై చంద్రబాబు బీజేపీ ఢిల్లీ పెద్దలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బిజెపితో పొత్తు కుదురుతుందా లేదా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చగా మారింది. టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.
పొత్తులపై చర్చించడానికి ఢిల్లీ రమ్మని చంద్రబాబును అమిత్ షా పిలిచినట్టు సమాచారం. దీంతో ఈ రాత్రికి అమిత్ షా, జేపీ నడ్డా తో చంద్రబాబు భేటీ కానున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. బాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మెజారిటీ బిజెపి ఏపీ నేతలు టిడిపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే మంచిదని చెప్పినట్టుగా సమాచారం. మరి ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబు ఢిల్లీలో బిజెపి అగ్ర నాయకులతో భేటీ కానున్న క్రమంలో పొత్తు కుదురుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనను అటు వైసీపీ, ఇటు కాంగ్రెస్ నిశితంగా గమనిస్తున్నాయి.












Click it and Unblock the Notifications