ఎపి రాజధాని: రైతులకు చంద్రబాబు బుజ్జగింపులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అభిప్రాయ సేకరణ జరపడానికి గుంటూరు జిల్లాకు వెళ్లిన మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులకు కొన్ని గ్రామాల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి, తుళ్లూరు మండలాల రైతులతో చంద్రబాబు మంగళవారం హైదరాబాదులోని లేక్వ్యూ అతిథి గృహంలో సమావేశమయ్యారు.
రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. రాజధాని ప్రాంతంలో జరిగే అభివృద్ధిని చంద్రబాబు రైతులకు వివరించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చేవారి కుటుంబాల నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. భూయజమానులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. సిల్క్ డెవలప్మెంట్ ద్వారా పరిశ్రమల్లో అవకాశం వచ్చేలా చూస్తామని ఆయన చెప్పారు.
రాజధానికి భూములు ఇచ్చే రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి వచ్చే పరిశ్రమలను ముందుకు రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పారు. భూ సేకరణకు ముందుకు వచ్చే రైతులు ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారు. భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని అన్నారు.

దొనకొండ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్
ప్రకాశం జిల్లా దొనకొండలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 45 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ను ఎర్పటాు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని అన్నారు.
సోలార్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, గ్రానైట్ కంపెనీల ఏర్పాటుకు సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన చెప్పారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేస్తామని అన్నారు. బివోటీ (బిల్డ్ - ఆపరేట్ - ట్రాన్స్ఫర్) విధానంలో పెట్టుబడులు పెట్టేందుకు కెంపనీలు ముందుకు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. దొనకొండలో ఎపి రాజధానిని నిర్మించాలనే ప్రతిపాదన మొదట్లో వచ్చింది.
సిఎం వ్యాఖ్యలతో భయాందోళనలు
రాజధాని నిర్మాణానికి భూముల సేకరణ విషయంలో ప్రజల్లో ఏ విధమైన వ్యతిరేకత లేదని టిడిపి ప్రభుత్వం తప్పు దారి పట్టిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారథి విమర్శించారు. తమ పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. తమ జీవితాలు ఏమై పోవాలని నిలదీస్తున్నట్లు ఆయన తెలిపారు. పచ్చటి పొలాలను ఎదుకు నాశనం చేస్తారని ప్రశ్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ల్యాండ్ పూలింగ్కు అంగీకరించకపోతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నాయని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే తమ పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ రాజధాని ఏర్పాటుకు వ్యతికేరం కాదని, రైతులకు అండగా నిలబడాలన్నదే తమ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications