పురంధేశ్వరిని కలుస్తారా!, సీఎంతో ఇలాగేనా మాట్లాడేది: బాబు తీవ్ర ఆగ్రహం
విజయవాడ: తాము అమరావతికి వెళ్లబోమని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరిని కలవడం పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పైన ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
అమరావతికి ఉద్యోగుల తరలింపులో మరో మలుపు: కేసీఆర్కు చిక్కు!
జూన్ 27వ తేదీలోగా హైదరాబాదులోని ప్రభుత్వ ఉద్యోగులు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కొందరు వెళ్లేందుకు సముఖత వ్యక్తం చేయగా, మరికొందరు మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ ఉద్యోగులు కలిశారు. తాము ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి వెళ్లలేమని, ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆమెకు మెమోరాండం ఇచ్చి మొరపెట్టుకున్నారు.
బాబుకు చెప్పండి: పురంధేశ్వరికి ఏపీ ఉద్యోగుల మొర, ఏపీకి వెళ్లనని ఆత్మహత్యాయత్నం
ఇదిలా ఉంటే, పలువురు గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం నాయకులు శుక్రవారం నాడు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఉద్యోగుల పైన అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పురంధేశ్వరిని ఎందుకు కలిశారని ఆయన వారిని ప్రశ్నించారు. కాగా, అమరావతికి రావడానికి ఆరు నెలల గడువు కావాలని హెచ్ఓడీ ఉద్యోగులు చంద్రబాబును కోరారు. అది కుదరదని, ఈ నెల 27వ తేదీలోగా రావాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
బాబు ఇంకా మాట్లాడుతూ... ఇల్లు మారితే ఎలా అయితే వసతులు సమకూర్చుకుంటామో, ఇప్పుడు కూడా అలాగే సమకూర్చుకోవాలని హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులతో అన్నారు. ఉద్యోగులు అనవసర వివాదాలకు తావివ్వకుండా ప్రభుత్వానికి సహకరించాలని, సమస్యలు ఏమైనా ఉంటే స్వయంగా తననే సంప్రదించాలని, ఉద్యోగుల తరలింపు విషయంలో ఎవరినో కలిస్తే ప్రయోజనం ఉండదన్నారు.
సీఎంతో మాట్లాడే తీరు ఇదేనా?: బాబు ఆగ్రహం
సీఎంతే మాట్లాడే తీరు ఇదేనా అని కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం నాయకుడు పటేల్ పైన చంద్రబాబు మండిపడ్డారని తెలుస్తోంది. అమరావతి ఉద్యోగుల తరలింపుపై గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం నాయకులు కలిశారు. రోడ్డు మ్యాప్ లేదు, ఏం లేదు, అమరావతి ఎలా రావాలని అడగగా.. చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. సీఎంతో మాట్లాడే తీరు ఇదేనా అని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications