వైఎస్ సమాధిని పరిశీలించిన చంద్రబాబు: హైదరాబాద్ సభకు వస్తారా?
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా కడప జిల్లాలోని ఇడుపులపాయ ఎస్టేట్కు చేరుకున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఆయన వచ్చారు. ఈ పర్యటనలో ఆయన తన ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని, పొలాలను వీక్షించారు.
చంద్రబాబు దావోస్ పర్యటన
ఇదిలావుంటే, చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 19 నుంచి 24 వరకు దావోస్లో చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు వెంట మొత్తం 9 మంది సభ్యుల బృందం దావోస్ వెళ్లనున్నారు. బృందంలో మంత్రి యనమల, పరకాల సహా ఉన్నతాధికారులు ఉన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో చంద్రబాబు బృందం పర్యటన సాగనుంది.
కాగా, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల నేపథ్యంలో బిజెపి, తెలుగుదేశం పార్టీలు ఈ నెల 12వ తేదీన నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహించున్నాయి. ఈ సభకు చంద్రబాబు వస్తారా, లేదా అనే ఆసక్తి నెలకొని ఉంది. సభకు చంద్రబాబు వస్తారని తెలంగాణ టిడిపి నాయకులు చెబుతున్నారు. కానీ చంద్రబాబు రాక ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని తెలుస్తోంది.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో సీట్ల పంపకానికి తెలుగుదేశం, బిజెపి సమన్వయ కమిటీ సమావేశం హైదరాబాదులో శనివారం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ తెలుగుదేశం నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ నేత సుజనా చౌదరి హాజరయ్యారు. బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, తదితరులు హాజరయ్యారు.