Chandrayaan 3: అప్పట్లో చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్.. తేడాలేంటీ?
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. ఈ ప్రాజెక్ట్ ఇక ప్రయోగానికి సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో చందమామ వైపు దూసుకెళ్లబోతోంది.
శుక్రవారం మధ్యాహ్నం 2:35 నిమిషాలకు నింగిలోకి ఎగరనుంది చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్. దీనికి ఇవ్వాళ కౌంట్ డౌన్ ఆరంభమైంది కూడా. 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఈ రాకెట్. ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అవుతుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రుడిపైకి ఈ స్పేస్ క్రాఫ్ట్ను పంపిస్తారు ఇస్త్రో శాస్త్రవేత్తలు.

గతంలో చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైన విషయం తెలిసిందే. ఇందులో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టలేకపోయింది. చిట్ట చివరి నిమిషంలో గతి తప్పింది. 2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. ఆ తరువాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధృవం వైపు కూలింది.
చంద్రుడి ఉపరితలానికి సమీపించిన తరువాత ఇస్రో దాని వేగాన్ని నియంత్రించలేకపోయింది. ఫలితంగా శరవేగంతో అది ఉపరితలాన్ని ఢీకొట్టి.. ముక్కలైంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీనితో- ఈ ప్రయోగం విఫలమైనట్లు అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.
విక్రమ్ ల్యాండర్ లోని మూడు అతి కీలక పరికరాల్లో ఆర్బిటర్ ఒకటి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఆర్బిటర్.. ఈ మూడూ చంద్రయాన్-2 ప్రాజెక్టులో అత్యంత కీలకం. అందులో అమర్చిన ఆర్బిటర్ ద్వారానే ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ జాడను ఆ తరువాత కనుగొన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆర్బిటర్ లో అమర్చిన హైబీమ్ కెమెరా ద్వారా విక్రమ్ ల్యాండర్ జాడను గుర్తించారు.

ఇప్పుడు తాజాగా చంద్రయాన్ 3 మిషన్ ను చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. లాంచింగ్ వెహికల్ కోసం క్రయోజనిక్ ఇంజిన్ సీ-20ని వినియోగించారు. తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ లో టెస్ట్ ఫైర్ ఇదివరకే పూర్తయింది.
చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన ల్యాండర్కు సంబంధించిన ఎలక్ట్రో మేగ్నటిక్ ఇంటర్ఫెరెన్స్/ఎలక్ట్రో మేగ్నటిక్ కాంపాటిబిలిటీ పరీక్షలను బెంగళూరు పీణ్యాలోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో విజయవంతంగా నిర్వహించారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్, ఆటో కాంపాబిలిటీ టెస్ట్, యాంటెన్నా పోలరైజేషన్, ల్యాండర్, దానికి అమర్చిన రోవర్ ను పరీక్షించారు. అవన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించారు.
చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్ను ఈ రాకెట్తో పాటు పంపిస్తారు. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్, ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పోక్ట్రోస్కోపీ.. వంటివి ఈ రాకెట్ పేలోడ్స్.
చంద్రయాన్ 2 మొత్తం బరువు 3,850 కేజీలు. అందులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. దీని వ్యయం 970 కోట్ల రూపాయలు. చంద్రయాన్ 3 మొత్తం బరువు 3,900 కేజీలు. ఇందులో ప్రొపల్స్ మాడ్యుల్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. దీని నిర్మాణ వ్యయం 615 కోట్ల రూపాయలు.












Click it and Unblock the Notifications