నమ్మించి, టెక్కీపై అత్యాచారం: అభయ కేసులో ఛార్జీషీట్

కాగా, మూడు నెలల క్రితం హైదరాబాదులో టెక్కీ అత్యాచారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. యువతిని క్యాబ్ పేరిట నమ్మించి కారు ఎక్కించుకున్న నిందితులు ఆమెను భయపట్టి, మరో మార్గంలో తీసుకు వెళ్తూ నమ్మబలికి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి దారుణానికి ఒడిగట్టారు. కేసులో కీలక నిందితుడు సతీష్ కాగా, వెంకటేష్ రెండో నిందితుడు. సతీశ్ వోల్వో కారుకు డ్రైవర్.
ఓ కారును ఓ బిల్డర్ అద్దెకు తీసుకున్నాడు. బిల్డర్ పని మీద మరో ఊరికి వెళ్లడంతో సతీశ్ విలాసవంతమైన వోల్వో కారు వేసుకుని బయలుదేరాడు. తన స్నేహితుడు నెమ్మాది వెంకటేశ్వర్లును కారు ఎక్కించుకున్నాడు. ఇద్దరూ కూకట్పల్లిలోని ఎల్లమ్మ బండకు చెందిన వారే. సతీశ్ వోల్వో కారు నడుపుతుండగా వెంకటేశ్వర్లు ప్రయాణికుడిలాగా నటిస్తూ వెనుక సీటులో కూర్చున్నాడు. క్వాలిటీ ఇన్ మాల్ వద్ద క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న అభయ ముందు రాత్రి 8.45 ప్రాంతంలో కారు ఆగింది.
ఎక్కడికి అని వీరు అడగ్గా అభయ విప్రో జంక్షన్ అని చెప్పింది. సతీశ్ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. వెంకటేశ్వర్లు ప్రయాణీకుడిలా నటించాడు. అప్పటికి అభయ బెంగళూరులో ఉన్న ఓ ఫ్రెండ్తో ఆన్లైన్లో చాట్ చేస్తోంది. కారు కొంతదూరం వెళ్లాక విప్రో వైపు కాకుండా ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్లింది. చాటింగ్ చేస్తున్న ధ్యాసలో అభయ దీన్ని గమనించలేదు. తల పక్కకు తిప్పే సరికి ఆమెకు మార్గం కొత్తగా కనిపించింది. దాంతో వారిని ప్రశ్నించింది. తమకు దారి తెలియదని వారు అభయకు నమ్మబలికారు.
కొంచెం ముందుకు వెళ్లి ఔటర్ టోల్గేటు వద్ద కారు ఆపి.. 'విప్రో జంక్షన్కు ఎలా వెళ్లాలి' అని అక్కడి వాచ్మన్ను అడిగారు. మళ్లీ అక్కడి నుంచి సర్వీసు రోడ్డు పైకి వెళ్లారు. ఒకచోట నుంచి మరోచోటకు తిప్పుతుండటంతో అభయకు అనుమానం వచ్చింది. వెంటనే బెంగళూరులోని ఫ్రెండ్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ తర్వాత సతీశ్, వెంకటేశ్వర్లు తమ అసలు స్వరూపం బయటపెట్టారు. అభయ నుంచి ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేశారు. కారు తలుపులు, అద్దాలు తెరుచుకోకుండా లాక్ చేశారు.
అనంతరం రింగ్ రోడ్ టోల్గేట్ పక్క నుంచి ఉన్న కొల్లూరు సర్వీసు రోడ్డులోకి కారును మళ్లించారు. అరిస్తే చంపేస్తామంటూ అభయను బెదిరించారు. అక్కడి నుంచి పటాన్చెరువు శివారులో ఉన్న బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ అవతలున్న టేకు చెట్ల వద్దకు తీసుకెళ్లారు. ఒకపక్క మామిడి తోట, మరోపక్క టేకు చెట్లు ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపి వెనుక సీటులోనే ఆమెపై తొలుత సతీశ్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు కూడా అత్యాచారం జరిపాడు.
ఆ తర్వాత. రాత్రి 1.45 ప్రాంతంలో అభయను అదే కారులో ఆమె హాస్టల్ వద్ద దించారు. విషయం బయటికి చెబితే చంపేస్తామని గట్టిగా బెదిరించారు. పోలీసులకు సమాచారం అభయ నుంచి దుండగులు ఫోన్ లాక్కునే ముందు ఆమె వేసిన కేకలు బెంగళూరులోని స్నేహితుడికి వినిపించాయి. దీంతో అతను ఈ విషయాన్ని బాలానగర్లో ఉంటున్న స్నేహితులకు సమాచారం అందించాడు. వారు వెంటనే మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
18 రాత్రి నుంచి 19 ఉదయం దాకా గాలించినా పోలీసులకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత అభయ ఫోన్ స్విచ్ ఆన్ కావడంతో పోలీసులు ఆమెను సంప్రదించారు. వివరాలు చెప్పేందుకు తొలుత ఆమె భయపడింది. అదనపు ఉప కమిషనర్ (క్రైమ్స్) జానకీ షర్మిల అభయతో మాట్లాడి, నచ్చచెప్పి, దుర్మార్గులకు శిక్ష పడాల్సిందేనని, సహకరించాలని కోరారు. దీంతో అభయ పెదవి విప్పింది.
ఇద్దరు దుండగుల మాటల ద్వారా డ్రైవర్ పేరు సతీశ్ అని తెలిసిందని వివరించింది. పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి పేరు, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ సిసి కెమెరాలో లభించిన ఫుటేజ్ ఆధారంగా తీగలాగారు. కేసును ఛేదించారు. సతీశ్, వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications