ఆరున్నర కోట్లిచ్చా: మంత్రి విడదల రజినీకి, సీఎం జగన్ కు తలనొప్పిగా చిలకలూరిపేట పంచాయితీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో వైసీపీ మంత్రులపై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పై సొంత పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో అటు వైసిపికి ఇటు విడదల రజినీకి తలనొప్పిగా మారాయి.
మంత్రి విడదల రజనీపై వైసీపీ నాయకుడు మల్లెల రాజేష్ నాయుడు చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి.మంత్రి విడదల రజిని తనకు టికెట్ ఇప్పిస్తానని 6.5 కోట్లు వసూలు చేసిందని చిలకలూరిపేట నియోజకవర్గం సీటు విషయంలో విడదల రజిని తనను మోసం చేసిందని మల్లెల రాజేష్ నాయుడు వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అధినాయకత్వం వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్న వేళ డబ్బుల కు టికెట్లు అమ్ముకుంటున్న వ్యవహారం మల్లెల రాజేష్ నాయుడు వ్యాఖ్యలతో చర్చనీయాంశం అయింది. వచ్చే ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మంత్రి విడదల రజినిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించి, చిలకలూరిపేట వైసిపి ఇన్చార్జిగా మల్లెల రాజేష్ నాయుడు ను ప్రకటించారు. అయితే మల్లెలకు చిలకలూరిపేటలో గెలుపు అవకాశాలు లేకపోవడంతో మళ్లీ నియోజకవర్గ ఇన్చార్జిని మార్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడును ఎన్నికల బరిలో నిలిపారు .
దీంతో మల్లెల రాజేష్ నాయుడు తన దగ్గర డబ్బులు తీసుకుని విడదల రజిని మోసం చేసిందని ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కు 6.5 కోట్లు తీసుకుందని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తన సీట్ ను వేరే వారికి కేటాయించడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడితో ఆగక ఈ వ్యవహారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి దాకా తీసుకువెళ్లారు.
ఆయన మధ్యవర్తిత్వంతో విడదల రజిని 3.5 కోట్లు తిరిగి ఇచ్చారని మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు. విడదల రజనీకి దమ్ముంటే చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఇక ఇదే సమయంలో కావటి మనోహర్ నాయుడుకు స్థానిక వైసీపీ నేతలు సహకరించే అవకాశ లేదని మల్లెల రాజేష్ నాయుడు తేల్చిచెప్పాడు. తనను మార్చాలనుకునే పక్షంలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆయనకు సీట్ ఇస్తే 20 కోట్లు ఖర్చుపెట్టి అయినా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, 2019 ఎన్నికల సమయంలో రజినీ కారణంగా మర్రి రాజశేఖర్ కు అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కు చిలకలూరిపేట టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అలా కాకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే పర్యవసానం వేరేలా ఉంటుంది అంటూ హెచ్చరించారు. ఇక తాజాగా చిలకలూరిపేట వ్యవహారంలో కొనసాగుతున్న రచ్చ మంత్రి విడుదల రజనీకి అటు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారింది.












Click it and Unblock the Notifications