కిడ్నాపర్ల అరెస్ట్, ఐదుగురు మహిళలు: సైకో వీరంగం
హైదరాబాద్: చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా పలువురు చిన్నారులు అపహరణకు గురువుతున్నారు. వారి నుండి ఆరేడుగురు చిన్నారులను రక్షించినట్లుగా తెలుస్తోంది. నిందితులు నల్గొండ జిల్లాకు చెందిన వారు.
శంషాబాద్లో బుల్లెట్లు స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారులు ఓ ప్రయాణికుడి వద్ద నుంచి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతనిని అరెస్టు చేశారు. దక్షిణ భారతదేశంలోని విమానాశ్రయాలపై తీవ్రవాదులు విరుచుకుపడే అవకాశం ఉందని గురువారమే ఐబి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి భద్రత పెంచారు.
బాలుడు సజీవ దహనం
హైదరాబాదులోని కుషాయిగూడలో ప్రమాదం జరిగింది. స్థానిక పారిశ్రామికవాడలోని అంజన కాంప్లెక్స్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక బాలుడు అగ్నికీలల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యాడు. మరో బాలుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.
సైకో వీరంగం
హైదరాబాదులోని మాసాబ్ ట్యాంకు వద్ద సైకో వీరంగం సృష్టించాడు. అతను చిన్న పిల్లలపై దాడికి ప్రయత్నించాడు. ఇది గుర్తించిన స్థానికులు అతనిని చితకబాది పోలీసులకు అప్పగించారు.