బస్సు ప్రమాదం: చిరు ఫ్యాన్స్ సంఘం నేత మృతి
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదం అఖిల కర్ణాటక చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ మరణించినట్లు తెలుస్తోంది. వెంకటేష్ యాదవ్ మృతికి ఆంధ్రప్రదేస్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు సంతాపం ప్రకటించారు. కాగా, బస్సు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 మంది మరణించారు.
కాగా, బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారని డిఐజి తెలిపారు. గాలి బాలసుందర్రాజు, ఆయన భార్య విజయకుమారి, ఆయన సోదరి గాలి మేరి ఈ బస్సు ప్రమాదంలో మరణించారు. బాలసుందర్రాజు ఓ రెసిడెన్షియల్ పాఠశాలను నడుపుతున్నాడు.
బస్సు ప్రమాదం నుంచి యోగేష్ (బెంగళూర్), రాజేష్ (బెంగళూర్), శ్రీధర్ (హైదరాబాద్), జైసింగ్ (ఉత్తరప్రదేశ్), బాషా బయటపడ్డారు. డ్రైవర్, క్లీనర్లతో పాటు ఏడుగురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. బెంగళూర్లో హెచ్పి కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లి వస్తున్న రాష్ట్రానికి చెందిన సురేష్ అనే యువకుడు మరణించాడు. ఇంటర్వ్యూలో అతనికి ఉద్యోగం వచ్చింది. అతని వార్షిక వేతనాన్ని 7 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇతను మచిలిపట్నానికి చెందినవాడు.
కాగా, యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న మంజునాథ్ రెడ్డి కూడా ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. బస్సు ప్రమాదంలో మరణించినవారిలో ఎక్కువ మంది బెంగళూర్కు చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ సంఘటనా స్థలాన్ని సందర్సించారు. బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.