ఎమ్మెల్యేలకు కెవిపి నో: అలిగిన చిరంజీవిలో ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్తో భేటీ సమయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సీమాంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, ఎన్నికల ప్రణాళిక కమిటీ సభ్యులు డిగ్గీతో శనివారం భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ భేటీ సమయంలో చిరంజీవితో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గాంధీ భవన్కు వచ్చారు. వారు చిరంజీవితో పాటు సమావేశానికి వెళ్లాలని అనుకున్నారు. ఈ సమయంలో చిరు వారిని లోనికి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. దానిని కెవిపి అడ్డుకున్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎన్నికల కమిటీ సభ్యులు కాదు కదా అని కెవిపి చెప్పారు.
కెవిపి వ్యాఖ్యలతో చిరు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. అలక వహించారు. తాను కూడా ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిని కాదని ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారట. తాను కూడా వెళ్లిపోతానని చెప్పారట. ఇప్పుడు ఏమయిందని చిరును కెవిపి ప్రశ్నించారు. దీంతో అక్కడ కొంత వేడి రాజుకుంది.
ఎమ్మెల్యేలకు అనుమతి లేనందున... తాను కూడు సభ్యుడిని కాదని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేశాయట. ఆ తర్వాత చిరు ఒక్కటే సమావేశానికి వెళ్లారు. ఎమ్మెల్యేలు వెళ్లలేదు. ఈ సమావేశంలో చిరు... సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీని బలోపేతం చేస్తానని డిగ్గీకి హామీ ఇచ్చారు.