మెగా కుటుంబం భారీ విరాళం
Chiranjeevi: కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలికి వస్తూనే ఉన్నాయి. మృతుల సంఖ్య 357కు చేరింది. ఇంకా 200 మంది ఆచూకీ తెలియరావట్లేదు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
కిందటి నెల 29వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలు గ్రామాలు చిక్కుకుపోయాయి. బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. వర్షాలు సైతం దీనికి తోడు కావడం వల్ల ప్రాణ నష్టం మరింత పెరిగింది.

కొండచరియలు విరిగి పడ్డ ఘటనలో మూడు జిల్లాలు ప్రభావితం అయ్యాయి. మెప్పాడి, ముండక్కై, చూరల్మాలా, ఆట్టమాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. కోజికోడ్ జిల్లా వనిమాళ్ గ్రామ పంచాయితీ పరిధిలోని విలంగాడ్ వద్దా కొండచరియలు విరిగిపడ్డాయి.
చూరల్మాలా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అత్యధిక మరణాలు ఇక్కడే సంభవించినట్లు చెబుతున్నారు. కొన్ని భారీ భవనాలు మినహా మిగిలిన నివాసాలన్నీ బురద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. గ్రామం మొత్తం బురద పేరుకుపోయి కనిపించింది. వాటి మధ్యలో నుంచి మృతదేహాలను వెలికి తీస్తోన్నారు రెస్క్యూ సిబ్బంది.

ముండక్కై, మెప్పాడి, ఆట్టమాల, విలాంగాడ్ వంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. మరిన్ని మృతదేహాలు వెలుగులోకి రావొచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, ఆర్మీ జవాన్లు, సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. హెలికాప్టర్లను వినియోగిస్తోన్నారు.
పణమారంపుజ, కరమంథోళ్, కబిని నదులు వరద తాకిడికి గురయ్యాయి. వాటిపై నిర్మించిన పలు వంతెనలు ధ్వంసం అయ్యాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల బురద, చెట్లు.. ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చాయి. తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలను ముంచెత్తాయి.
ఈ విపత్తు బారిన పడ్డ మలయాళీలను ఆదుకోవడానికి పెద్దఎత్తున విరాళాలను ప్రకటిస్తోన్నారు చాలామంది. దేశీయ పారిశ్రామికదిగ్గజం గౌతమ్ అదాని, తమిళ హీరో సూర్య, జ్యోతిక 50 లక్షలు, రష్మిక మందన్న 25 లక్షల రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

తాజాగా- మెగాస్టార్ చిరంజీవి కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వందలాది మంది ప్రాణాలను కోల్పోవడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రామ్చరణ్తో కలిసి తాను కలిసి కోటి విరాళంగా అందజేస్తున్నామని అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కేరళ, అక్కడి ప్రజలు ఎప్పుడూ తనను ఆదరిస్తూ వస్తోన్నారని, ఈ కష్ట సమయంలో వారిని ఆదుకోవడం తన కర్తవ్యమని పేర్కొన్నారు. అక్కడ సహాయ, పునరావాస చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తోన్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications