చిరంజీవి మనసు దోచిన వైసీపీ ఎంపీ
మెగాస్టార్ చిరంజీవి సినీరంగంలో ఒక వెలుగు వెలిగిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరఫున తిరుపతి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతర పరిణామాల్లో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. తర్వాత కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు.
మళ్లీ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉంటూ రాజకీయాలకు దూరం జరిగారు. తాజాగా విశాఖపట్నంలో సీనియర్ ఎన్టీఆర్ వర్థంతిని, అక్కినేని నాగేశ్వరరావు జయంతిని కలిపి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలుపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రజాసేవ ధ్యాస తప్ప.. సంపాదనపై ధ్యాస లేని ఎంపీగా తనకు లావు శ్రీకృష్ణదేవరాయలు కనిపించారని కొనియాడారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య తనయుడైన శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో పార్టీలు, వర్గాలకు అతీతంగా గుంటూరు జిల్లాతోపాటు తన నియోజకవర్గ పరిధిలో ఎన్నో మంచి పనులు చేసి ప్రజల మనసు దోచుకున్నారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకృష్ణదేవరాయలు సినిమాల పరంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ కు నిజమైన వారసుడు చిరంజీవి అని ప్రశంసించారు. తన నటన, డ్యాన్స్ తో తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని, ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవిని ఏ ఒక్క వర్గానికి పరిమితం చేయకూడదని హితవు పలికారు. వైసీపీ ఎంపీపై చిరంజీవి లాంటి గ్రేట్ పర్సనాలిటీ పొగడటంపై వైసీపీ పార్టీతోపాటు ఎన్టీఆర్, ఏఎన్నార్ అభిమానులు కూడా సంతోషపడుతున్నారు. ఏనాడూ రూపాయి గురించి కృష్ణదేవరాయలు ఆలోచించలేదని, ప్రజలకు ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలన్నదే తన ధ్యేయంగా ఉండదని పార్టీ అభిమానులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications