చింటూకు గన్స్ ఇచ్చిందెవరు: మేయర్ అనురాధ హత్యలో మరో లాయర్ పాత్ర?
చిత్తూరు: మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల హత్య కేసులో మరో న్యాయవాది పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరుకు చెందిన ఓ లాయర్ పాత్ర ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సదరు లాయర్ను ఏ12 ముద్దాయిగా పోలీసులు చేర్చారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో పుంగనూరుకు చెందిన న్యాయవాది ఆనంద్ కుమార్ పైన కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. తాజాగా, మరో లాయర్ పేరు తెరపైకి రావడం గమనార్హం. మరోవైపు, మేయర్ దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులు హరిదాస్, మురుగ, పరంధామలను కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చింది.
మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల పైన సోమవారం ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ విచారణ చేపట్టారు. చింటూకు చెందిన యాదమరి మండలంలోని క్వారీ, చిత్తూరులోని ఓ కళాశాలకు వెళ్లి రికార్డులు పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, మేయర్ దంపతుల హత్య కుట్రలో ప్రధాన నిందితుడైన చింటూకు సహకరించిన వారందరి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. హత్యకు ముందు, ఆ తర్వాత సహాయం చేసిన వారిని అదుపులోకి తీసుకుని, హత్య చేసిన, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై వివిధ కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు.
ఈ నేపథ్యంలో హత్య చేసేందుకు చింటూకు తుపాకులను అందించిన వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ పేర్కొన్నారు. నిందితులు రజనీకాంత్, నరేంద్రబాబు ఆలియాస్ పకోడి, శ్రీనివాస ఆచ్చారిలను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు.
హత్య అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి వాహనాన్ని సమకూర్చిన మరో నిందితుడు కమలాకర్ను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మేయర్ దంపతుల హత్యలో నిందితుడు మూడు తుపాకుల్ని ఉపయోగించినట్లు విచారణలో వెలుగు చూసింది.
వీటిలో ఒక తుపాకీని చిత్తూరులోని కయనికట్టు వీధికి చెందిన రజనీకాంత్ అందజేశారు. హత్యకు ముందే తన వద్ద ఉన్న తుపాకీని సర్వీసు చేసి చింటూకు అందచేశాడు. మరో తుపాకీ కోసం చిత్తూరులో తుపాకులను సర్వీస్ చేసే సురేంద్ర బాబును అడిగాడు.
అతను ఇచ్చేందుకు తిరస్కరించడంతో... రజనీకాంత్ మధ్యవర్తిత్వంతో సురేంద్ర బాబుకు రూ.35వేలు చెల్లించి తుపాకీని తీసుకున్నాడు. కర్నాటకలోని చింతామణి ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అచ్చారి కోలారులో తుపాకులను సర్వీస్ చేసే కేంద్రం ఉంది.
సురేంద్ర బాబుకు అతనితో ఉన్న సంబంధాలు ఉండటంతో చింటూ.. శ్రీనివాస్ అచ్చారి వద్ద కొనుగోలు చేశాడు. ఆ తర్వాత బెంగళూరులోని రాయల్ హార్బరీ నుంచి ఎయిర్ పిస్టల్ను కోనుగోలు చేశాడు. 25 రౌండ్లలో మూడు బుల్లెట్లు హత్య జరిగిన ప్రాంతంలో లభ్యం కాగా, మిగిలిన 16 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
25 రౌండ్లలలో మిగిలిన రౌండ్ల కోసం తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ హత్య ఘటనలో నిందితుడు ఉపయోగించిన మూడు తుపాకుల్లో రెండు హత్య జరిగిన చోటే లభ్యమవ్వగా, మరొకటి నిందితుడు ప్రయాణించిన కారులో లభించాయి.