ఘనంగా క్రిస్మస్ వేడుకలు- అర్ద్రరాత్రి నుంచి ప్రార్ధనలు : ప్రముఖుల శుభాకాంక్షలు..!!
దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ పండగ కళను సంతరించుకున్నాయి. భక్తులంతా అర్ధరాత్రి నుంచే వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్, ఒమిక్రాన్ మహమ్మారులను దృష్టిలో పెట్టుకొని నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని మెదక్ సీఎస్ చర్చిలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శిలువ ఊరేగింపు మొదటి ఆరాధనలో చర్చ్ బిషప్ సాల్మన్ రాజు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీలోనూ క్రిస్మస్ వేడుకలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అక్కడ కూడా రాత్రి నుంచి వేడుకలు మొదలయ్యాయి.
ఆ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ఆంక్షల నడుమ
మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్లో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండటంతో ఉదయం ఆరు గంటల తరువాత ఆయా రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ఆంక్షల నేపథ్యంలో నిర్వాహకులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై నిషేధించటంతో అక్కడ సెల్రబేషన్స్ పైన ప్రభావం పడింది.
ఆంక్షల నేపథ్యంలో చర్చిలలోకి ఎవరినీ అనుమతించలేదు. చాందినీ చౌక్లోని బాప్టిస్ట్ చర్చి, గోల్ మార్కెట్లోని సేక్రడ్ హార్ట్ కేథడ్రల్ చర్చిలను మూసేశారు. అయితే, కొంతమంది భక్తులు చర్చి బయట ప్రార్థనలు చేసుకున్నారు.
నిబంధనలు పాటిస్తూ ప్రార్ధనల్లో
మహారాష్ట్రలోనూ ఆంక్షల మధ్య క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చర్చిల సామర్థ్యంలో 50శాతం వరకే అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. పరిమిత సంఖ్యలోనే భక్తులు హాజరయ్యారు. బంగాల్లో సామూహిక ప్రార్థనలు జరిగాయి. కోల్కతాలోని సెయింట్ థెరిసా చర్చిలో నిర్వహించిన ప్రార్థనలకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కర్ణాటక బెంగళూరులోని సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. హిమాచల్ప్రదేశ్లో స్థానికులతో పాటు విదేశీ పౌరులు సైతం చర్చిలలో ప్రార్థనలు చేశారు. ధర్మశాలలోని వైల్డర్నెస్ చర్చిలో బెల్జియం దౌత్యవేత్త ప్రార్థనలు చేశారు. ఇంటి నుంచి దూరంగా ఉన్న తమకు.. ఇక్కడి క్రైస్తవులతో కలిసి క్రిస్మస్ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందంటూ వారు చెప్పుకొచ్చారు.
అర్ద్రరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్ధనల్లో
పుదుచ్చేరిలో పెద్ద ఎత్తున భక్తులు అర్ధరాత్రి నుంచే చర్చిలకు వచ్చి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా పలువురు ప్రముఖులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇడుపుల పాయలోని ప్రార్ధనా మందిరంలో ప్రత్యేక ప్రార్ధనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మరి కాసేపట్లో క్రిస్మస్ ప్రార్ధనల్లో సీఎం కుటుంబం మొత్తం పాల్గొననుంది. ఇక, క్రిస్మస్ గిఫ్ట్ లు పంపుతూ పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.