జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ రాసిన లేఖలో ట్విస్ట్: సుప్రీం చీఫ్ జస్టిస్ యాక్షన్ షురూ?: సంస్కరణలు
అమరావతి: గత ఏడాది రాష్ట్రంలో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఉదంతాల్లో ఒకటి- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం. సుప్రీంకోర్టులో రెండో అత్యున్నత స్థానంలో కొనసాగుతోన్న న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై అవినీతి ఆరోపణలు చేస్తూ వైఎస్ జగన్ రాసిన లేఖ.. దేశవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. ప్రశాంత్ భూషణ్ వంటి సీనియర్ న్యాయవాదులు దీనిపై చర్చ పెట్టారు. రాజకీయంగా.. న్యాయవ్యవస్థ పరంగా ఆ లేఖ సంచలనానికి తెర తీసింది.
Recommended Video

ఆ కథనం ఏం చెబుతోంది?
ఈ లేఖలో వైఎస్ జగన్ పొందుపరిచిన అంశాలు..ఎన్వీ రమణపై చేసిన లేవనెత్తిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారని అంటున్నారు. వాటిని నిశితంగా పరిశీలించిన తరువాతే బొబ్డే.. న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు తెర తీశారంటూ ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. దీనిపై తాజాగా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించంది. న్యాయ వ్యవస్థలో కొనసాగుతున్నాయని భావిస్తోన్న లోపాలను సరిదిద్దడానికి ఎస్ ఏ బొబ్డే నడుం బిగించారని ఆ కథనం అభిప్రాయపడింది.

అఫిడవిట్ రూపంలో
ఈ విషయంలో ఆయన వైఎస్ జగన్ రాసిన లేఖలోని అంశాలు, ఆరోపణలను విశ్వసించలేదని, దీనిపై లోతుగా విశ్లేషించారని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం చెబుతోంది. ఈ లేఖను అఫిడవిట్ రూపంలో పంపించాలంటూ ఎస్ ఏ బొబ్డే.. వైఎస్ జగన్ను ఆదేశించినట్లు తెలిపింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా.. ముఖ్యమంత్రి తాను రాసిన లేఖను యధాతథంగా సంతకం చేసి, అఫిడవిట్ రూపంలో మళ్లీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు పంపించినట్లు పేర్కొంది. అక్టోబర్ 6వ తేదీ నాడే ఈ లేఖను వైఎస్ జగన్ అఫిడవిట్ రూపంలో పంపించారని తన కథనంలో ప్రచురించింది.

జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరిల నుంచి అభిప్రాయ సేకరణ..
అదే సమయంలో ఎస్ ఏ బొడ్డే.. వైఎస్ జగన్ రాసిన లేఖపై జస్టిస్ ఎన్వీ రమణ, అప్పటి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి అభిప్రాయాన్ని తీసుకున్నట్లు ఆ కథనం వెల్లడించింది. ముఖ్యమంత్రి తాను రాసిన లేఖలో చేసిన ఆరోపణలు, ఇతర అంశాలు ఎంత మాత్రం వాస్తవం అనే విషయంపై ఆరా తీయగా.. జేకే మహేశ్వరి కూలంకషంగా వివరణ ఇచ్చారని, ఎన్వీ రమణ ఎలా స్పందించారనడానేది పూర్తిగా తెలియరాలేదని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. తమ ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి తీర్పులనైనా జేకే మహేశ్వరి.. ఎన్వీ రమణను సంప్రదించి ఇస్తున్నారంటూ జగన్ తన లేఖలో ఆరోపించినట్లు తెలిపింది.

తోటి న్యాయవాదులతోనూ చర్చించినట్లు..
వైఎస్ జగన్ రాసిన ఈ లేఖ పట్ల ఎస్ ఏ బొబ్డే కొంతమంది తన తోటి న్యాయమూర్తులతోనూ క్షుణ్నంగా చర్చించారని, మరింత లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు తమకు ఉన్న విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఆ మీడియా సంస్థ తన కథనంలో ప్రచురించింది. అదే సమయంలో జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేయడం, అంతకుముందు మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పిటీషన్ వ్యవహారంలో జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్ను తొలగించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న సీక్వెన్స్ను బట్టి చూస్తే.. జగన్ రాసిన లేఖపై ఎస్ ఏ బొబ్డే తన చర్యలను ప్రారంభించినట్లు కనిపిస్తోందని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications