'ఏపీకి తీవ్ర నిరాశ, హోదాపై క్లారిటీ ఇవ్వని జైట్లీ, మరింత గందరగోళం'
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం పైన విపక్ష నేతలు దిగ్విజయ్ సింగ్, సీతారాం ఏచూరీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయి రెడ్డి తదితరులు శుక్రవారం నాడు స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని జైట్లీ తేల్చి చెప్పారు. దీనిపై వారు స్పందించారు.
డిగ్గీ మాట్లాడుతూ.. జైట్లీ సమాధానం ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఇది సరికాదని అభిప్రాయపడ్డారు.
సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా చెప్పాలని నిలదీశారు. నిబంధనలు సాకుగా చూపి ప్రత్యేక హోదాను పక్కన పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని చెప్పారు. జైట్లీ సమాధానంతో మరింత గందరగోళం ఏర్పడిందన్నారు.

ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. హోదా పైన జైట్లీ క్లారిటీ ఇవ్వలేదన్నారు. హోదా పైన స్పష్టత ఇవ్వకుంటే ఏపీ ప్రజలు తిరగబడే అవకాశముందని హెచ్చరించారు.
టిడిపి నేత సీఎం రమేష్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఏపీకి ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేస్తారనే విషయమై శ్వేతపత్రం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ... 14 ఫైనాన్షియల్ కమిషన్ సిఫార్సులు కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదన్నారు. అవి సలహాలు, సిఫార్సులు మాత్రమేనని చెప్పారు. యూపీఏ కేబినెట్ ప్రత్యేక హోదా ఇస్తామని తీర్మానం చేసిందని గుర్తు చేశారు. విపక్ష నేతలపై కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. ఏపీకి చేయాల్సిందంతా చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications