జగన్ ముద్ర లేకుండా చంద్రబాబు స్కెచ్, కానీ - ఆట మొదలు..!!
ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. తొలి రోజునే జగన్ ముద్ర..ఓటింగ్ పై చంద్రబాబు ఫోకస్ చేసారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తూనే అయిదు సంతకాలు చేసారు. అందులో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పెన్షన్లను రూ 4 వేలకు పెంచారు. అదే విధంగా జూలైన 1న లబ్దిదారులకు రూ 7 వేలు పెన్షన్ అందనుంది. జగన్ ముద్ర లేకుండా వరుస నిర్ణయాలతో ముందుకు వెళ్లేలా చంద్రబాబు కొత్త స్కెచ్ తో సిద్దమయ్యారు.
చంద్రబాబు నిర్ణయంతో
జగన్ తన పాలనలో రూ 3 వేల పెన్షన్ అందించారు. దాదాపు 67 లక్షల మందికి లబ్దిదారులు ఉన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రూ 4 వేలకు పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చారు. జగన్ తన మేనిఫెస్టోలో చివరి రెండేళ్లు రూ 250 చొప్పున పెంచుతూ రూ 3,500 కి పెన్షన్ పెంచుతానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు పెన్షన్ పైన సంతకం చేసారు. చెప్పిన విధంగా రూ 4 వేలకు పెన్షన్ పెంచటంతో పాటుగా ఇతర వర్గాలకు పెన్షన్ రూపంలో అందుతున్న మొత్తాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

జగన్ ఓట్ బ్యాంక్ పై గురి
ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు పింఛన్ రూ.4 వేలకు పెంపుదల చేసారు. దివ్యాంగులకు పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెరిగింది.పూర్తిస్థాయి దివ్యాంగులకు పింఛన్ రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతూ నిర్ణయించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పింఛన్ పెంపుదల పైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు చెప్పింది ఏదీ చేయరని జగన్ తన ఎన్నికల ప్రచారలో పదే పదే చెబుతూ వచ్చారు. దీనికి సమాధానంగా ఇప్పుడు చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు వైపు టర్న్ అయ్యేనా
రాష్ట్రంలో దాదాపు 67 లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి ఎన్నికల సంఘం ఆంక్షలు విధించటంతో ఆ సమయంలో వైసీపీ నేతలు చంద్రబాబు పైన విమర్శలు చేసారు. జగన్ కు పెన్షన్ లబ్దిదారులు పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలిచారు. చంద్రబాబు రూ 4 వేలకు పెంచుతూ హామీ ఇవ్వటంతో ఆ ఓటర్ల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కూటమికి మద్దతు లభించినట్లు ఓట్ల సరళి స్పష్టం చేస్తోంది. ఇప్పుడు హామీ నిలబెట్టుకుంటూ అమలు దిశగా అడుగుల వేస్తుండటంతో..జగన్ ఈ ఓట్ బ్యాంక్ కోల్పోవాల్సిందేననే చర్చ మొదలైంది. సంక్షేమంలో జగన్ ముద్ర తొలిగించటమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇది ఎంత వరకు ఫలిస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications