ఉత్తరాంధ్రకు వరద ముప్పు..! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీలోని కోస్తా జిల్లాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాంధ్రలోనూ పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని జిల్లాల్లో వర్షాల పరిస్ధితిపై ఆరా తీశారు. వారికి తగు సూచనలు చేశారు.
రాష్రంలో వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ, అందుబాటులో ఉండాలని వారికి స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

అలాగే ఉత్తరాంధ్రలో వర్షాలపై మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు ఎక్కడికక్కడ అలర్ట్ లు జారీ చేస్తున్నారు. స్థానికంగా మత్సకారుల్ని వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు చేశారు. ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్ లు పంపుతోంది.












Click it and Unblock the Notifications