చంద్రబాబు ప్రభుత్వంలో డేటా లీక్: చిటికెలో తెలిసిపోతుంది
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పారదర్శక పరిపాలనకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంట టెక్నాలజీని వినియోగిస్తోంది.
చిటికెలో తెలుసుకునే విధంగా
ఈ క్రమంలో అన్ని శాఖలు, విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకునే విధంగా మరో ప్రక్రియను చేపట్టింది. ఆయా శాఖల మధ్య డేటా అనుసంధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా డేటా లేక్ను సృష్టించనుంది. దీనికోసం- అన్ని శాఖలు/విభాగాలకు సంబంధించిన సమాచారం అంతా ఒకేచోట క్రోడీకరించనుంది.

ఆర్టీజీఎస్పై..
ఈ డేటా అనుసంధాన ప్రక్రియపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), వాట్సప్ పరిపాలన వంటి అంశాలపై ఈ సమీక్ష సాగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీశ్ కుమార్ గుప్తా.. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు.
డేటా అనుసంధాన ప్రక్రియ..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ- డేటా అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల మధ్య ఉన్న డేటాను ఆర్టీజీఎస్ అనుసంధానించాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను ఎలా అందించగలమనే విషయంపై అధ్యయనం చేయాలని అన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్లో ఎలాంటి అవరోధాలు లేకుండా
ఇప్పుడున్న 160కి పైగా సేవలకు అదనపు ఇంకా ఎలాంటి సౌకర్యాలను కల్పించగలమనే విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ అమలు విధానంలో ఎలాంటి అవరోధాలు, ప్రతిబంధకాలు, సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఏఐ ద్వారా విశ్లేషించుకోవాలి..
శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవాలని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,770 సీసీ కెమెరాలు వినియోగంలో ఉన్నాయని, వాటన్నింటినీ కూడా క్రోడీకరించాలని, ఏఐ ద్వారా విశ్లేషించుకోవాలని, సమాచారాన్ని ఉన్నత స్థాయి అధికారి వరకూ ఇచ్చిపుచ్చుకునేలా ఈ విధానం ఉండాలని అన్నారు.
ఎక్కడైనా ఎలాంటి నేరమైనా జరిగితే..
రాష్ట్రంలో ఎక్కడైనా ఎలాంటి నేరమైనా జరిగితే ఆ సమాచారం వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లాలని, తక్షణమే సంఘటన స్థలానికి చేరుకునేలా ఈ వ్యవస్థ ఉండాలని చంద్రబాబు చెప్పారు. నేరాలను అరికట్టడంలో, నేరస్తులను గుర్తించడంలో ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications