విజయవాడ వచ్చి మాట్లాడలేవా, ఇగో పెరిగింది: పత్తిపాటిపై బాబు తీవ్ర ఆగ్రహం,
విజయవాడ: ఉద్యోగుల బదలీ అంశం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పత్తిపాటి పుల్లా రావు పైన మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగుల బదలీ విషయంలో సమన్వయం ఉండాలని, అలా లేకుంటే ఎలా అని మండిపడ్డారు.
చంద్రబాబు ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తిపాటి పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. గుంటూరు నుంచి విజయవాడ ఎంత దూరమని, వచ్చి మాట్లాడడానికి తీరిక లేకుండా పోయిందా అని ప్రశ్నించారు.
మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్ల మధ్య ఎందుకు సమన్వయం లోపిస్తోందని ప్రశ్నించారు. మనలో మనం కౌన్సిలింగ్ పెట్టుకునే పరిస్థితులు వచ్చాయని, ఇది సరైన పద్ధతి కాదని చంద్రబాబు మంత్రి పత్తిపాటికి హితవు పలికారు.
మంత్రులు, అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. నేతల్లో ఇగో పెరిగిపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ... పాలనలో ఉత్తమ ఫలితాల కోసమే బదిలీల ప్రక్రియ అని చెప్పారు. రకరకాల ఒత్తిళ్లతో ఇష్టానుసారం బదిలీలు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు.
ఎవరూ మన బంధువులు కాదని, బదలీల్లో మార్గదర్శకాలను అమలు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసేందుకు ముందుకు వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇస్తామని తెలిపారు. విద్యాసంస్థలు ప్రారంభం నాటికే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. పని తీరులో తేడా వస్తే ఉద్యోగులకు బదలీ తప్పదని, ఒక్కసారి బదలీ అయితే మూడేళ్ల పట్టించుకోరని అనుకోవద్దన్నారు.