నారా భువనేశ్వరి బర్త్డే.. వేరుశనగ నూనె కొన్న సీఎం!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటనలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. అన్నదాత సుఖీభవ కార్యక్రమం కోసం చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన సీఎం, అక్కడ గుడిపల్లి నాగభూషణం అనే రైతుకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఫోన్ కాల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రైతు నాగభూషణం ప్రకృతి వ్యవసాయంతో పాటు సాంప్రదాయ పద్ధతిలో నూనెలు తయారు చేసే గానుగను కూడా నడుపుతున్నారు. తాను స్వయంగా తయారు చేసిన కోల్డ్ప్రెస్డ్ (గానుగ) వేరుశనగ నూనెను వాడి చూడాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. "ఇంట్లోకి ఏ వస్తువు కొనాలన్నా నా సతీమణి భువనేశ్వరిని అడగాలి" అని నవ్వుతూ చెప్పారు.

వెనువెంటనే పొలంలో నుంచే భువనేశ్వరికి సీఎం ఫోన్ కలిపారు. ఆమెతో మాట్లాడి, అక్కడ లభిస్తున్న సహజసిద్ధమైన కోల్డ్ప్రెస్డ్ వేరుశనగ నూనె విశేషాలను వివరించారు. భార్య అనుమతితో అక్కడికక్కడే ఒక లీటరు వేరుశనగ నూనెను కొనుగోలు చేశారు. సతీమణి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ఆమెకు ఇచ్చిన ఈ 'ప్రకృతి కానుక' వైవిధ్యమైన బహుమతిగా నిలిచింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ, సతీమణి పుట్టినరోజున ఇలా గృహిణి ప్రాధాన్యతను గౌరవిస్తూ, పల్లెటూరి పొలాల్లోంచి ఫోన్ చేసి మాట్లాడటం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది.
అనంతరం ముఖ్యమంత్రి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. జీవామృతం, ఘన జీవామృతం, వేపాస్త్రం వంటి సహజ వ్యవసాయ ఉత్పాదనలను స్థానికంగా లభించే వనరులతో తయారు చేసి రైతులకు అందజేస్తున్న విధానాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులకు శిక్షణ, ప్రదర్శనలు, సాంకేతిక సహాయాన్ని కూడా ఈ కేంద్రం అందిస్తోందని నాగభూషణం చెప్పారు. ఆ తర్వాత బొప్పాయి తోటను పరిశీలించి..రైతు అందించిన బొప్పాయి పండును సీఎం తిన్నారు. బొప్పాయితో పాటు ఇతర పంటలను సాగుతో జీవ వైవిధ్యం పెరగడంతో పాటు భూసారం, తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతోందని రైతు వివరించారు. చీడపీడల నివారణకు కూడా ఇది దోహదపడుతోందని నాగభూషణం సీఎం చంద్రబాబుకు వివరించారు.














Click it and Unblock the Notifications