శ్రీవారి భక్తుల కోసం కొత్త యాప్, ఇక తక్షణమే- సులువుగా దర్శనం.. కొత్త వసతి సముదాయం..!!
తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమయంలోనే భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది. వరుస సెలవులతో పెరిగిన రద్దీ క్రమేణా తగ్గుతోంది. బ్రహ్మోత్సవాల వేళ ప్రత్యేక సేవల తో పాటుగా వీఐపీ దర్శనాలను రద్దు చేసారు. గరుడ వాహనం రోజున భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇదే సమయంలో భక్తులకు కొత్త యాప్ తో మరిన్ని సదుపాయాలు అందు బాటులోకి తీసుకొస్తున్నారు.
తిరుమలలో సాలికట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకోనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రం 7.40 గంటలకు బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకి చేరుకొని...అక్కడ నుంచి పట్టువస్త్రాలను ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లి శ్రీవారికి సమర్పించనున్నారు. దర్శనాంతరం 2027 టీటీడీ క్యాలెండర్లు, డైరీలతో పాటు భక్తుల సౌకర్యార్థం 2 యాప్ లను ఆవిష్కరించి.. ఆ తరువాత పెద్దశేష వాహనసేవలో పాల్గొన నున్నారు. రేపు ఉ 8:40 గంటల ప్రాంతంలో వైకుంఠ క్యూ కాంప్లెక్సులో నూతనంగా ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఉ 9:25 గంటల ప్రాంతంలో రిలయన్స్ ఈవీ బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఎస్వీ మ్యూజియంను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. టీటీడీ పైనా సమీక్ష చేయనున్నారు.

భక్తుల కోసం కొత్తగా యాప్
కాగా.. తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తులకు వసతి గదులు, కాటేజీలలో భక్తులు ఎదుర్కొనే సమస్యలను తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో 'నందకం' పేరుతో ఒక మొబైల్ యాప్ను అందు బాటులోకి తెచ్చింది. ఫెసిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎఫ్ఎంఎస్) ఆధారంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో ఈ యాప్ను రూపొందించారు. సీఎం చంద్రబాబు ఈ యాప్ ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం తిరుమలలోని 7,043 వసతి గదులను ఈ యాప్కు అనుసంధానించారు. సమస్యలను ఫొటోలు, వీడియోలు లేదా ఆడియో రూపంలో యాప్లో నమోదు చేస్తే రెండు గంటల్లోనే దాన్ని పరిష్కరించేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. భక్తులకు కేటాయించే వసతి గదుల రసీదుపై ఈ యాప్కు సంబంధించిన క్యూఆర్ కోడ్ను ముద్రించ నున్నారు. అదే విధంగా వసతి కష్టాలకు చెక్ పెట్టే విధంగా తిరుపతిలో రెండు భారీ వసతి సముదాయాలు అందుబాటులోకి వచ్చాయి.
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం సముదాయాల పనులు చివరి దశకు వచ్చాయి. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయినా, లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తయ్యాయి. ఈ రెండు సముదాయాల్లో భాగంగా ఒక్కో భవనంలో తొమ్మిది అంతస్తులు నిర్మిస్తున్నారు. గదులు 532 చొప్పున 1,064 ఉన్నాయి. దాదాపుగా పదివేల మంది భక్తులకు వసతి కల్పించే వెసులుబాటు కలగనుంది. కాగా, రెండో అంతస్తులో రిసెప్షన్, అన్నదానం, వసతి కేంద్రాలు ఉంటాయి. మూడు, నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు.. సుమారు 7,000 మందికి సరిపడా లాకర్ల ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే నెల జరిగే నవరాత్రుల బ్రహ్మోత్సవాల సమయం లో వీటిని సీఎం చంద్రబాబు తో ప్రారంభించేందుకు టీటీడీ కార్యాచరణ సిద్దం చేసింది.














Click it and Unblock the Notifications
