సీఎం జగన్ అభ్యర్దుల మార్పు జాబితా సిద్దం, వీరికి రిలీఫ్ - ఎవరెక్కడ..!!
సీఎం జగన్ ఎన్నికల వేళ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్దులను బరిలోకి దింపుతున్నారు. సీట్లు మార్చుతున్న సిట్టింగ్ లకు భవిష్యత్ పదవుల పైన హామీలు ఇస్తున్నారు. కొత్తగా మార్పులు చేసిన నియోజకవర్గాల జాబితా ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు.
జగన్ కొత్త లెక్కలు : ముఖ్యమంత్రి జగన్ కొత్త లెక్కలతో అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ముందుగా 11 మందితో మార్పుల జాబితా విడుదల చేసిన సీఎం జగన్..రెండో జాబితా దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సీట్లు ఈ సారి దక్కవని ప్రచారంలో ఉన్న కొందరు మంత్రులకు తిరిగి సీట్లు ఖాయం చేసారు. అదే విధంగా కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా..మరి కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా మార్పులు చేసారు. కొందరు సీనియర్ల ను పార్టీ సేవలకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా సీట్లు దక్కవని ప్రచారం జరిగిన మంత్రులు రోజా, అంబటి రాంబాబుకు తమ నియోజకవర్గాల నుంచే మరోసారి పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. అదే విధంగా మైలవరం ఎమ్మెల్యే వసంతకు అదే సీటు ఖాయం చేసారు. బాలినేని తిరిగి ఒంగోలు నుంచి పోటీ చేయనున్నారు.

మార్పులు - చేర్పులు : తాజాగా తీసుకున్న మార్పుల నిర్ణయంలో భాగంగా కళ్యాణ దుర్గం నుంచి అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను బరిలోకి దించుతున్నారు. మడకశిర నుంచి శుభకుమార్, పెనుకొండ నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్లు ఖరారయ్యాయి. కదిరి నుంచి మక్బూల్, ప్రకాశం జిల్లా దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జగ్గంపేట నుంచి తోట నర్సింహం, పిఠాపురం నుంచి వంగా గీత, శింగనమల నుంచి శ్రీనివాస మూర్తి, యర్రగొండ పాలెం నుంచి తాడిపర్తి చంద్రశేఖర్, ప్రత్తిపాడు నుంచి వరుపుల సుబ్బారావు, గిద్దలూరు నుంచి సిద్దా రాఘవ రావు లేదా వంశీధర్ రెడ్డి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో తుది జాబితా పైన జనవరి 2న జిల్లా నేతలు, ప్రాంతీయ సమన్వయకర్త విజయ సాయిరెడ్డితో సమావేశం ఏర్పాటు చేసారు.

తుది జాబితా సిద్దం : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు స్థానం పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వయోభారం కారణంగా తప్పించాలని జగన్ భావిస్తున్నారు. అక్కడ చేనేత వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు పరిశీలనలోకి వచ్చింది. అయితే, తాజాగా సీఎం ను కలిసిన చెన్నకేశవ రెడ్డి తాజాగా మాచాని వెంకటేష్ తోపాటుగా సీఎం జగన్ ను కలిసారు. చేనేత వర్గానికి ఇవ్వాలని భావిస్తే వెంకటేష్ కు ఇవ్వాలని..గెలిపించి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీంతో..ఎమ్మిగనూరు నుంచి మాచాని వెంకటేష్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక..విశాఖ జిల్లాలోనూ కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మార్పులు - చేర్పులు చేసిన జాబితా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications