ఇటు సీఎం జగన్ -అటు కేటీఆర్ : ఇద్దరూ చేరేది అక్కడికే - ఏం జరగబోతోంది..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్దరూ ఇప్పుడు విదేశీ టూర్ సాగనుంది. ఇద్దరి లక్ష్యం ఒకటే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి అధికారిక హోదాలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అదే సమయంలో వ్యక్తిగత టూర్ కూడా ఉంది. దావోస్ టూర్ తో పాటుగా కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ టూర్ కు ప్లాన్ చేసారు. ఇప్పటి వరకు..తెలంగాణలో తమ హయాంలో భారీ ఎత్తున పరిశ్రమలు - పెట్టుబడుల విషయం లో సక్సెస్ అయ్యామని చెబుతున్న మంత్రి కేటీఆర్.. అందులో భాగంగానే మరో అడుగు వేస్తున్నారు.
కేటీఆర్ యూకే టు దావోస్
ఈ రోజు నుంచి నుంచి యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరగనున్న వివిధ సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. పలు ప్రముఖ ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పరిశ్రమల అధిపతులతో మంత్రి సమావేశమవుతారు. లండన్, దావోస్ పర్యటనకు కేటీఆర్ నేతృత్వంలోని బృందం బయల్దేరి వెళ్లింది. పలు ప్రముఖ ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పరిశ్రమల అధిపతులతో మంత్రి సమావేశమవుతారు. ప్రపంచ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానం లక్ష్యంతో ఇక్కడి విధానాలు, పరిస్థితులను వారికి వివరిస్తారు. లండన్ పర్యటన అనంతరం ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు దావోస్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమిట్ కు హాజరవుతారు.
సీఎం జగన్ తొలిసారిగా అధికారిక హోదాలో
ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించనున్న వివిధ ప్యానెల్ చర్చల్లో పాల్గొననున్న కేటీఆర్... రాష్ట్రంలోని అత్యుత్తమ విధానాలు, అనుకూల పరిస్థితులను వివరిస్తారు.దాదాపు 35 మంది వ్యాపార ప్రముఖులతో ఆయన విడిగా సమావేశమవుతారు. సీఎం జగన్..ఏపీలో సంక్షేమం పైన ఇప్పటి వరకు ప్రధానంగా ఫోకస్ చేయగా.. ఇప్పుడు ఏపీకి పెట్టుబడల దిశగా దావోస్ లో 30 మంది ఎమ్మెన్సీ ప్రతినిధులతో సమావేశాలు జరపనున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ దావోస్ లో ఉంటారు. సీఎం జగన్ తో పాటుగా మంత్రులు బుగ్గన..అమర్నాధ్..అధికారులు సీఎంతో పాటు టీంలో ఉంటున్నారు. అయితే, ఏపీలో పెట్టుబడుల అవకాశాలు.. అక్కడ ఉన్న అనుకూల పరిస్థితుల పైన వివరించి.. పరిశ్రమల స్థాపనకు ఆహ్వానించనున్నారు.
కీలక నేతలంతా ఒకే వేదికపై
ఇక, ప్రధాని సైతం దావోస్ సమిట్ కు హాజరు కానున్నారని చెబుతున్నారు. పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఒక విధంగా.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు దావోస్ కేంద్రంగా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా జాతీయ స్థాయిలో ప్రముఖులు మొత్తం ఒకే వేదిక మీదకు రానున్నారు. దీంతో..ఇప్పుడు దావోస్ లో పెట్టుబడులను ఆకర్షించే అంశాల పైన అంతర్జాతీయ సదస్సు కావటంతో.. రాజకీయంగానూ ఈ సమావేశాలు..ప్రత్యేకంగా సీఎం జగన్ - తెలంగాణ మంత్రి కేటీఆర్ పొల్గొనే సమావేశాలు...వాటి ఫలితాల పైన ఆసక్తి నెలకొని ఉంది.