వైసీపీలో ఆ సీట్లకు అభ్యర్ధులు ఫైనల్..! ఎమ్మెల్యేగా బరిలోకి సిట్టింగ్ ఎంపీ..!!
తూర్పు గోదావరిపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ - జనసేన పొత్తు ఖరారైతే మారే సమీకరణాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాలకు అభ్యర్ధుల ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది. కీలక నియోజకవర్గాల్లో ముఖ్య నేతలకు బాధ్యతలు కేటాయిస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..సీఎం జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులను ఖరారు చేస్తానని ప్రకటించారు. మొత్తం 175 సీట్లు ఈ సారి గెలవాల్సిందేనని సీఎం జగన్ పదే పదే లక్ష్యం నిర్దేశిస్తున్నారు.
గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్
అందులో భాగంగా ప్రతీ సీటు పైనా ప్రత్యేకంగా సమాచారం సేకరిస్తున్నారు. ఏ ఒక్క సీటు వదులుకోవటానికి సిద్దంగా లేనని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే గోదావరి జిల్లాల విషయంలో సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ రెండు జిల్లాల్లోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల మొదలు ఎమ్మెల్యేల పని తీరు వరకు అనేక అంశాల్లో..విభిన్న మార్గాల ద్వారా క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నాలుగు స్థానాలు దక్కించుకుంది. అందులో ఇప్పుడు రాజమండ్రి అర్బన్ తో పాటుగా మండపేట పైన ఇప్పుడు ముఖ్యమంత్రి సర్వేల ఆధారంగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. రాజమండ్రి అర్బన్ లో ప్రస్తుతం టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్ధిగా రౌతు సూర్యప్రకాశ రావు పోటీ చేసి ఓడిపోయారు.
రాజమండ్రి సిటీ బాధ్యతలు భరత్ కు
ఈ సారి సీఎం జగన్ ఇక్కడ ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను బరిలోకి దింపే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. భరత్ అనూహ్యంగా తొలి ఎన్నికల్లోనే రాజమండ్రి ఎంపీగా గెలుపొందారు. లోక్ సభలో వైసీపీ విప్ గా ఉన్నారు. రాజమండ్రి అర్బన్ లో ఇంఛార్జ్ - పార్టీ కార్యక్రమాల నిర్వహణ పైన అస్పష్టత ఉంది. దీంతో..మార్గాని భరత్ ను రాజమండ్రి అర్బన్ ఇంఛార్జ్ గా అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో భరత్ ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక, టీడీపీ సిట్టింగ్ అయిన మండపేట స్థానంలోనూ సీనియర్ నేతకు బాధ్యతలు కేటాయించారు. అక్కడ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా వేగుల జోగేశ్వర రావు ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులకు ఈ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. తోట త్రిమూర్తులు గతంలో రామచంద్రాపురం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల తరువాత వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు.
సామాజిక సమీకరణాలే కీలకంగా
కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా తోట త్రిమూర్తులకు పేరుంది. అదే సమయంలో రామచంద్రాపురం నుంచి ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సర్వే నివేదికలు- జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి నివేదికల ఆధారంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ అభ్యర్ధిగా తోట త్రిమూర్తులు పోటీ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో..గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ అనూహ్య ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు టీడీపీకి పవన్ తోడు అవుతారనే అంచనాలతో సీఎం జగన్ గోదావరి జిల్లాల్లో అభ్యర్ధుల ఎంపిక పైన ఆచి తూచి అడుగు వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.