శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్!
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) కింద ఏకంగా రూ.5,681 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మొత్తంతో వరంగల్, కరీంనగర్ మరియు ఖమ్మం-వరంగల్-కరీంనగర్ కారిడార్లలో మూడు మెగా ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. ఇక ఇదే శుభవార్త సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.
అర్బన్ ఛాలెంజ్ ఫండ్.. అభివృద్ధికి నిధులు
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ క్రింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, వరంగల్ మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునీకరణకు రూ.4,674 కోట్లు కేటాయించారు. కరీంనగర్ మోడల్ రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.840 కోట్లు కేటాయించారు. ఖమ్మం-వరంగల్-కరీంనగర్ కారిడార్ అభివృద్ధికి రూ.166 కోట్లు కేటాయించారు.

కరీంనగర్ ప్రాజెక్ట్ క్రింద జరిగే అభివృద్ధి ఇదేనన్న బండి సంజయ్
కరీంనగర్ ప్రాజెక్టు కింద మోడల్ రోడ్లు, స్కైవాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, జంక్షన్ అభివృద్ధికి రూ.630 కోట్లు, వర్షపు నీటి కాలువల పునరుద్ధరణ మరియు వరద నివారణకు రూ.130 కోట్లు, ఘన వ్యర్థాల నిర్వహణ మరియు డంప్ యార్డ్ అభివృద్ధికి రూ.80 కోట్లు కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టులు నగరాల ముఖచిత్రాన్ని మార్చేసి, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని బండి సంజయ్ తెలిపారు.
కరీంనగర్ను ఈ పథకంలో చేర్చడానికి వ్యక్తిగతంగా కృషి చేశానన్న బండి సంజయ్
బండి సంజయ్ తన ట్వీట్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ను ఈ పథకంలో చేర్చడానికి తాను వ్యక్తిగతంగా కృషి చేశానని, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు ప్రధాని మోదీ సహకారం ఉందని వెల్లడించారు. అపెక్స్ కమిటీ ఆమోదం తర్వాత క్షేత్ర స్థాయి తనిఖీలు పూర్తి చేసి తుది మంజూరు లభించిందన్నారు.
ఈ జిల్లాల ప్రజల జీవన ప్రమాణాలు ఉన్నత స్థాయికి
ఈ నిధులు తెలంగాణలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా మురుగునీటి సమస్యలు, రోడ్డు నెట్వర్క్, వరద నియంత్రణ, పరిశుభ్రత వంటి కీలక అంశాలపై దృష్టి సారించడం జరుగుతుంది. ఇప్పటికే మొదటి విడతలో రూ.1,420 కోట్లు విడుదలైనట్లు సమాచారం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణాకు కేంద్ర సహకారం
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం తెలంగాణలోని పట్టణాభివృద్ధి రంగంలో ఒక మైలురాయిగా బండి సంజయ్ అభివర్ణించారు. రాష్ట్రం మరింత ఆధునికంగా, సౌకర్యవంతంగా మారడానికి ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు.












Click it and Unblock the Notifications