NEET పేపర్ లీక్ జరగలేదు.. కాదు జరిగింది..! ఎన్టీఏ ఛీఫ్ వర్సెస్ విద్యామంత్రి..!
దాదాపు 23 లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పరీక్ష (NEET UG 2026) పేపర్ లీక్ విషయంలో కేంద్రం వద్ద ఇప్పటికీ స్పష్టత లేకుండా పోతోంది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ ను అంగీకరించిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినట్లు కూడా బహిరంగంగానే ప్రకటించారు. కానీ తాజాగా నీట్ లీక్ పై విచారణ జరుపుతున్న పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డీజీ అభిషేక్ సింగ్ మాత్రం పేపర్ లీక్ కాలేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్ధుల భవిష్యత్తును కేంద్రం ఎంత లైట్ తీసుకుంటుందో అర్దమవుతోందన్న చర్చ జరుగుతోంది.
ఓవైపు నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ పై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసి లీక్ పై వివరాలు సేకరిస్తోంది. అదే సమయంలో విద్యావ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్.. నీట్-యూజీ 2026 పేపర్ తమ వ్యవస్థ ద్వారా లీక్ కాలేదని చెప్పారు. అయితే, ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది. అంతకు ముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీక్లో కమాండ్ గొలుసులో లోపం ఉందని బహిరంగంగానే అంగీకరించారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ప్రకటించారు.

ఇప్పుడు ఎన్టీఏ డీజీ చేసిన ప్రకటనకూ, గతంలో విద్యామంత్రి చేసిన ప్రకటనకూ ఏమాత్రం సంబంధం లేదు. కమాండ్ గొలుసులో లోపం' ఉన్నప్పుడు, పేపర్ 'వ్యవస్థ ద్వారా' లీక్ కాలేదని ఎన్టీఏ చీఫ్ ఎందుకు చెబుతున్నారనే అంశం మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ వివరణ స్పష్టత కంటే, జాగ్రత్తగా ఎంచుకున్న పదజాలంగానే అనిపిస్తుంది. "వ్యవస్థ" అంటే కేవలం ఆఫీసులోని కంప్యూటర్ సర్వర్ కాదు. ముద్రణ, ప్యాకేజింగ్, రవాణా, భద్రత, తనిఖీ, సమన్వయం, పర్యవేక్షణ.. ఇలా పరీక్ష నిర్వహణలోని ప్రతి దశ ఇందులో భాగం. ఈ గొలుసులో ఎక్కడ పత్రం లీక్ అయినా అది వ్యవస్థాగత వైఫల్యమే అవుతుంది. కానీ నీట్ రచ్చలో దొరికిపోయిన ఎన్టీఏ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications