ఢిల్లీకి సీఎం జగన్ - ప్రధానితో భేటీ : న్యాయ సదస్సుకు హాజరు..!!
ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన కు సిద్దమయ్యారు. రెండు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ నెల తొలి వారంలో సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. నెల రోజుల సమయంలోనే ప్రధాని మోదీతో మరోసారి సమావేశం కానుండటంతో ఈ పర్యటన ఆసక్తి కరంగా మారింది. ఈ సారి ప్రధానితో భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో అర్దిక పరిస్థితులు..కేంద్రం నుంచి తోడ్పాటు అంశం పైన చర్చించనున్నట్లు సమాచారం.
ప్రధానితో సీఎం జగన్ కీలక భేటీ
దీంతో పాటుగా పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించనున్నారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని కేంద్రం చెబుతున్నా... సవరించిన అంచనాలకు ఇప్పటి వరకు అధికారికంగా ఆమోదం ఇవ్వలేదు. అదే విధంగా తాజాగా నిర్మాణాలకు సంబంధించి మరో రూ 800 కోట్ల మేర అదనపు భారం పడనుందని తాజాగా అంచనాకు వచ్చారు.
ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇప్పటికే మూడేళ్లు పూర్తి కావటం... ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవటంతో..దీని పైన ప్రధానితో సీఎం జగన్ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.
జాతీయ న్యాయ సదస్సులో..
అదే విధంగా రాష్ట్రపతి ఎన్నిక..తాజాగా పెట్రో ఉత్పత్తుల పైన వ్యాట్ తగ్గింపు అంశం పైనా నేరుగా ప్రధానితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయ అంశాల పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, ఈ నెల 30వ తేదీన జ్యుడిషీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు.
ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది.
ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాల పైన ఇప్పటికే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - సీఎం జగన్ సమావేశమయ్యారు. జాతీయ సదస్సులో ప్రస్తావించాల్సిన అంశాల పైన చర్చించారు.
రాష్ట్రపతి ఎన్నిక - ఏపీ రాజకీయాల పైనా
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున సత్కరించారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ లో సీజేఐతో సీఎం జగన్ కలవనున్నారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతూ..పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో మరోసారి భేటీ కానుండటం రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.