సీఎం జగన్ కీలక నిర్ణయం - సజ్జల బాధ్యతలు సాయిరెడ్డికి: ఇక నుంచి ఇద్దరూ ఇలా..!!
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా.. ప్రభుత్వం - పార్టీలో కీలక బాధ్యతలు కేటాయించిన జగన్..అందులో అవసరమైన మార్పులు చేసారు. పార్టీ ముఖ్య నేతలు విజయ సాయిరెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డికి తొలుత అప్పగించిన బాధ్యతల విషయంలో మార్పులు చేసారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసి తిరిగి అవకాశం రాని వారికి జిల్లా అధ్యక్షులుగా.. రీజనల్ సమన్వయకర్తలుగా సీఎం జగన్ బాధ్యతలు కేటాయించారు.
ఈ ఇద్దరు నేతలకు సాయిరెడ్డి - సజ్జలకు సైతం బాధ్యతలు అప్పగించారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ పార్టీ ముఖ్యులతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. మంత్రులు - పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటుగా.. సమన్వయకర్తలు సైతం ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమయంలోనే సీఎం జగన్ గతంలో కేటాయించిన బాధ్యతల విషయంలో కొన్ని మార్పులు చేసారు.

సజ్జల బాధ్యతలకు సాయిరెడ్డికి
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇప్పటి వరకు పార్టీ అనుబంధ సంఘాల కో ఆర్డినేటర్గా బాధ్యతలు కేటాచించారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించారనే విమర్శలు వచ్చాయి. దీంతో పునఃసమీక్షించిన సీఎం.. సాయిరెడ్డికి బాధ్యతలు పెంచాలని నిర్ణయించారు.
దీంతో..మరిన్ని బాధ్యతలు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. గతంలో కేటాయించిన బాధ్యతలకు అదనంగా.. సజ్జలకు కేటాయించిన పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షుల సమన్వయ బాధ్యతలను సాయిరెడ్డికి అప్పగించారు. ఇక, సజ్జల బాధ్యతల మార్పుల్లో భాగంగా.. ఎమ్మెల్యేలు, మీడియా కో-ఆర్డినేషన్ బాధ్యతను కేటాయించారు. ఇప్పటికే ఎమ్మెల్యేల సమన్వయ బాధ్యతలను సీఎం వద్ద సజ్జల నిర్వహిస్తున్నారు.

ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే ప్రచారంతో
తాజాగా మంత్రి పదవి ఆశించి భంగపడి..తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన పాయకరావు పేట ఎమ్మెల్యే బాబురావు సైతం సజ్జలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో మంత్రి పదవులు ఈ సారి పూర్తిగా సర్వే నివేదికలు - సామాజిక సమీకరణాలు- 2024 ఎన్నికలే లక్ష్యంగా ఖరారు చేసినట్లు వెల్లడించారు. పదవులు దక్కని వారికి భవిష్యత్ లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఇక, విశాఖ - ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించటం ద్వారా పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గించారంటూ అంర్గతంగానూ చర్చలకు కారణమైంది. పార్టీ జాబ్ మేళాలను నిర్వహిస్తున్న సాయిరెడ్డి.. ప్రాంతీయ పార్టీల్లో అధినేత ఏ ఆదేశం ఇచ్చినా పాటించాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఛార్టెంట్ ఎకౌంటెంట్ గా ఉన్న తనకు ఈ పదవులు సీఎం కారణంగానే వచ్చాయంటూ చెప్పుకొచ్చారు.

సీఎం ఏ బాధ్యతలు అప్పగించినా
ఇక, సాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గుతోందనే ప్రచారంతో..సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే...26 జిల్లాల అధ్యక్షులు - ప్రాంతీయ సమన్వయకర్తల కో ఆర్డినేషన్ చేసే కీలక బాధ్యతలను సాయిరెడ్డికి కేటాయించారు. ఇక, ఈ రోజున పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ నిర్వహించనున్న భేటీ పైన ఆసక్తి నెలకొని ఉంది.
ఈ సమావేశం ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్దేశించటంతో పాటుగా.. జగన్ తాను పార్టీలో నేతల మధ్య అనైక్యత- ఆదిపత్య పోరు వంటి అంశాల పైన తన విధానం తేల్చి చెప్పనున్నారు. ఇక, మే 2వ తేదీ నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం పైన దిశా నిర్దేశం చేయనున్నారు. 2024 ఎన్నికలు..ప్రశాంత్ కిషోర్ తో సంబంధాల పైన జగన్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications