సీఎం జగన్ కీలక నిర్ణయం: మండలి పరిణామాలపై మంత్రులతో: నెక్స్ట్ ఇలా చేద్దాం..!
మూడు రాజధానుల బిల్లు విషయంలో మండలి ఛైర్మన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిల్లు మండలిలో ప్రవేశ పెట్టే సమయం నుండి చివరి నిర్ణయం వరకు ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గందరగోళం..సభలో ఉద్రిక్తతల మధ్య బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారంగా ప్రకటించారు. దీని పైన ప్రతిపక్ష టీడీపీ సంతోషంలో మునిగిపోగా..అధికార పక్షం ఛైర్మన్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్లాక్ డేగా వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో మండలిలో నిర్ణయం తరువాత మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కీలక వ్యాఖ్యలు చేసారు. మండలి నిర్ణయం పైన చర్చించారు. తదుపరి అడుగుల పైన నిర్దేశించారు. మంత్రులతో ఆయన చేసిన వ్యాఖ్యలు..తాజా పరిస్థితులతో కీలకంగా మారాయి.
సీఎం వద్ద మంత్రుల ఆవేదన..
మండలి ఛైర్మన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ తీసుకున్న నిర్ణయం పైన అసహనం..ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన మంత్రులంతా మీడియా ముందుకొచ్చి చరిత్రలో బ్లాక్ డేగా అభివర్ణించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చొని ఛైర్మన్ ను ప్రభావితం చేసారంటూ మండిపడ్డారు. ఇక, ఆ వెంటనే మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు. మండలి లో జరిగిన పరిణామాలను వివరించారు. ఛైర్మన్ తాను తీసుకుంటున్న నిర్ణయం తప్పని చెబుతూనే..విచక్షణాధికారంగా సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయించారని వివరించారు. ఆ సమయంలో సభలో టీడీపీ సభ్యుల తీరు పైన సీఎం కు వివరించారు. రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి సైతం మండిలిలో టీడీపీ తీరు పైన ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో..సీఎం సైతం జరిగిన పరిణామాలతో పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. అదే సమయంలో భవిష్యత్ కార్యాచరణ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
అడుగు ముందుకే వేద్దాం...
మండలిలో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినా..రాజధాని తరలింపుపై అడుగు ముందుకే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. సెలెక్ట్ కమిటీకి పంపారనే టెన్షన్ అవసరం లేదంటూ సీఎం వ్యాఖ్యానించినట్లుగా తెలిసింది. ఈ పరిణామాలు ఊహించనవేంటూ.. అసెంబ్లీలో ఈ రెండు బిల్లుల ఆమోదం సమయంలోనే తీర్మానం ఆమోదించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. సెలెక్ట్ కమిటీ నుండి బిల్లు వచ్చే సరికి సమయం పడుతుందని.. అలా కాకుండా మండలిలో బిల్లు ఆమోదించి ఉన్నా వెంటనే రాజధాని మార్పు జరగదు కదా అంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. సచివాలయాన్ని మార్చి తరువాతనే మార్చే అవకాశం ఉంది. ఇప్పుడూ అదే చేద్దామని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈలోగా న్యాయపరమైన ప్రతిబంధకాలు లేకుండా.. శాఖాధిపతులను విశాఖకు తరలించే పని ప్రారంభిద్దా మని సీఎం వ్యాఖ్యానించారు. సెలెక్ట్ కమిటీ నుంచి బిల్లులు వచ్చాక... ఉత్తర్వుల ద్వారా సచివాలయ తరలింపుపై ముందుకెళ్లవచ్చునని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది.
మండలిలో అవన్నీ మనకే..
ఇక, శాసన మండలి రద్దు గురించి ప్రచారం జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మండలిలో టీడీపీకి మెజార్టీ ఉన్నా..రానున్న రోజుల్లో మండలిలో ఖాళీ అయ్యే స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోకే చేరతాయన్నారు. మంగళవారం రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ సహా.. మరొకరి మాత్రమే అవకాశం కల్పిద్దామని చెప్పినట్లు తెలిసింది. 2024 నాటికి మండలిలో టీడీపీకి ముగ్గురో నలుగురో ఉంటారని అన్నట్లు తెలిసింది. దీంతో..మండలి రద్దు చేస్తారని..ఆ దిశగా ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంటారంటూ అర్ద్రరాత్రి వరకు ప్రచారం సాగింది. కానీ, ముఖ్యమంత్రి తన కేబినె ట్ సహచరులతో చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం...సీఎం మండలి రద్దు ఆలోచనలో లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో రాజధాని తరలింపు విషయంలో మాత్రం ముందుకే వెళ్లాలనే గట్టి నిర్ణయంతో ఉన్నారని మంత్రులు చెబుతున్నారు.