సీఎం జగన్ మార్క్: విద్యా కానుక,మానసిక వికలాంగుల స్కూల్స్ తో పాటు పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖలో అమలు చెయ్యాల్సిన పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సంబంధిత అధికారులతో సమావేశమైన జగన్ పలు కీలక పథకాలపై అధికారులతో చర్చించారు .
విద్యాశాఖలో అమలవుతున్న పథకాలపై సమీక్ష చేసిన సీఎం జగన్
గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అందరికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.విద్యాకానుక, జగనన్న గోరుముద్ద , మనబడి నాడు నేడు పథకాలపై సమీక్ష జరిపిన సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. మానసిక వికలాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్ పెట్టాలని చెప్పారు. పులివెందుల విజేత స్కూల్ తరహాలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్ ఉండేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం.
విద్యాకానుక కిట్ల పరిశీలన
ఇక ఈ సందర్భంగా ఉపాధ్యాయుల శిక్షణ సహా వర్క్బుక్, టెక్ట్స్బుక్, కరిక్యులమ్ల విషయంలో అధికారుల పనితీరును సీఎం జగన్ అభినందించారు. ఇక కొత్త పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లను సీఎం జగన్ పరిశీలించటమే కాకుండా 3 జతల యూనిఫాంకు సరిపోయే బట్టలు , నోటు పుస్తకాలు, బ్యాగ్, బూట్లు, సాక్సులు, బెల్టుల పంపిణీపై పలు సూచనలు చేశారు. ఇక వీటిని అందించటానికి కాంపిటీటివ్ టెండర్లు పిలిస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేయమని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు సమస్యల పరిష్కారానికి మొబైల్ యాప్
విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేయాలని సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు సైతం చక్కగా చదువుకోవాలని చాలా విద్యా సంస్కరణలు తీసుకొస్తున్న సీఎం జగన్ 6వ తరగతి నుంచే ఇంటర్నెట్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక విద్యా వ్యవస్థ ప్రక్షాళనతో పాటు చదువుకునే విద్యార్థులకు ఆర్ధిక భరోసా ఇస్తున్న సీఎం జగన్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు.