పులివెందుల సిఎస్ఐ చర్చిలో సీఎం జగన్ ప్రార్ధనలు; రాష్ట్రప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు!!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల కడప పర్యటనలో భాగంగా మూడో రోజు క్రిస్మస్ సందర్భంగా కడపలోని పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఇడుపులపాయ నుండి బయలుదేరి 8.50 నిమిషాలకు పులివెందులలోని భాకరా పురం హెలిపాడ్ కు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ నుండి నేరుగా సీఎస్ఐ చర్చి కి వెళ్లారు.
పులివెందులలోని సీఎస్ఐ చర్చి లో సీఎం జగన్ తో పాటు, వైయస్ విజయమ్మ తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం సీఎం జగన్, వైయస్ విజయమ్మ కేక్ కట్ చేశారు. క్రిస్మస్ ప్రార్ధనలలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సాటి మనుషుల పట్ల ప్రేమ , నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు మనలను సన్మార్గంలో నడిపించాలని, రాష్ట్ర ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపై 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ ను సీఎం జగన్ వైయస్ విజయమ్మ ఆవిష్కరించారు.
సీఎం జగన్ తో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు.
దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని సీఎం జగన్ పేర్కొన్నారు.
నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications