విశాఖ టూర్ లో సీఎం జగన్ మౌనం వెనుక..: స్టీల్ సిటీలో కొత్త టెన్షన్: ఏం జరుగుతోంది..!
ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనలో ఊహించని స్వాగతం లభించింది. మూడు రాజధానుల ప్రతిపాదన..విశాఖలో పరిపాలనా రాజధాని అంటూ చెప్పటంతో స్టీల్ సిటీ వాసులు సంతోషంతో కనిపించారు. ఇక, విశాఖలో ప్రభుత్వం తాజాగా ఒకే రోజు ఏడు జీవోల ద్వారా భారీగా నిధులు విడుదల చేసింది. ఇక, విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి జగన్ తొలి సారి విశాఖ వస్తున్నారని..భారీ స్వాగతం పలకాలంటూ విజయ సాయిరెడ్డి..మంత్రి అవంతి లాంటి వారు ముందస్తు ఏర్పాట్లు చేసారు.
27న కేబినెట్ లో ఈ నిర్ణయానికి ఆమోదం లభిస్తుందనే అంచనాతో..28న ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. కానీ, విశాఖ ఉత్సవ్ లో సీఎం మాత్రం నోరు విప్పలేదు. మౌనం పాటించారు. ఇప్పుడు సీఎం మౌనం వెనుక కారణం ఏంటనే చర్చ మొదలైంది. ఇదే ఇప్పుడు స్టీల్ సిటీలో అనేక రకాల సందేహాలకు కారణమవు తోంది. తాజాగా విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రిది వ్యూహాత్మక మౌనమా..లేక బలమైన కారణం ఉందా...
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..
ముఖ్యమంత్రి జగన్ కు గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖ నగరంలో ఘన స్వాగతం లభించింది. శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఏపీకి పరిపాలనా రాజధాని ఉండవచ్చంటూ చేసిన వ్యాఖ్యలు.. అదే తరహాలో జీఎన్ రావు కమిటీ సిఫార్సులు..ఎంపీ విజయ సాయిరెడ్డి..మంత్రుల వ్యాఖ్యలతో ఇక విశాఖ పరిపాలన రాజధాని అవ్వటం ఖాయమనే నమ్మకం విశాఖ నగర వాసుల్లో ఏర్పడింది.
తొలుత ఈ నెల 27న జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడుతుందని భావించి..ఆ మరుసటి రోజున విశాఖలో సీఎం పర్యటన ఏర్పాటు చేసారు. కానీ, కేబినెట్ సమావేశంలో నిర్ణయం వాయిదా పడింది. అయినా ముందుగా నిర్ణయించిన ప్రకారమే సీఎంకు పార్టీ నేతలు..స్థానికులతో కలిసి ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. దాదాపు 21 కిలో మీటర్ల మేర మానవ హారం ఏర్పాటు చేసారు. అయితే, ఆ తరువాత జరిగిన విశాఖ ఉత్సవ్ లో సీఎం ప్రసంగంలో ఏం చెబుతారనే ఆసక్తి అక్కడ కనిపించింది.
ముఖ్యమంత్రి మౌనంతో షాక్..
అంత ఘన స్వాగతం పలికిన విశాఖ నగర వాసులు ముఖ్యమంత్రి విశాఖ ఉత్సవ్ వేదికగా తమ ప్రాంతం పైన కీలక ప్రసంగం చేస్తారని అందరూ భావించారు. ఇందు కోసం విశాఖ బీచ్ వద్ద ఏర్పాటు చేసిన సభ కు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. లేజర్ షో తిలకించిన తరువాత ముఖ్యమంత్రి అందరికీ అభివాదం చేసారు. కానీ, మౌనం పాటించారు. ఒక్క మాట మాట్లాడకుండా వెళ్లిపోయారు.
దీంతో..ఒక్క సారిగా సభకు హాజరైన వారితో సహా పార్టీ నేతల్లోనూ..మంత్రులు షాక్ అయ్యారు. ఇంత ఏర్పాట్లు చేస్తే..కనీసం ముఖ్యమంత్రి హాజరైన వారికి ధన్యవాదాలు కూడా చెప్పకుండా వెళ్లిపోవటం..విశాఖలో ప్రభుత్వం తరపున ఏం చేయబోదీ ప్రకటిస్తారని భావిస్తే..దానికి విరుద్దంగా సీఎం వ్యవహరించటంతో వారికి ఏం జరుగుతందీ అంతు చిక్కలేదు. ప్రస్తుతం రాజధాని తరలింపు పై మూడు ప్రాంతాల్లో భిన్నవాదనలు..ప్రభుత్వం నుండి కమిటీ ఏర్పాటు చేయటంతో ముందుగానే ఏదీ మాట్లాడకుండా వెళ్లిపోయారని పార్టీ నేతలు వివరణ ఇస్తున్నారు.
సాయి వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..
ముఖ్యమంత్రి పర్యటన రోజునే పార్టీ కీలక నేత..రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖకు రాజధాని తరలకుండా న్యాయవ్యవస్థ ద్వారా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ విమర్శ చేసారు. అదే సమయంలో 27న జరగే కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం జరుగుతుందని భావించినా..వాయిదా పడటం..ఇప్పుడు ముఖ్యమంత్రి మౌనం పాటించటంతో స్టీల్ సిటీలో కొత్త చర్చకు కారణ మయింది.
అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా.ముందుకు వెళ్లే విధంగా వైసీపీ నేతలు ప్రకటనలు చేసారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంలో కేంద్ర పాత్ర కీలకం కానుంది. ముఖ్యమంత్రిది వ్యూహాత్మక మౌనమా.. లేక పరిణామాలు ఏమైనా పరిణామాల్లో మార్పులు జరుగుతున్నాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.