Southwest Monsoon 2026: ఐఎండీ చల్లని కబురు-రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్..!
వేసవి ప్రతాపంతో అల్లాడుతున్న ప్రజలు.. నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అనేక వాతావరణ అంచనాలు రుతుపవనాలు జూన్ 2-4 మధ్య వస్తాయని అంచనా వేశాయి. దీనికి అనుగుణంగానే జూన్ 3 కల్లా కేరళను నైరుతి రుతుపవనాలు తాకబోతున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) ఇవాళ వెల్లడించింది. గతంలో ఐఎండీ నైరుతి రుతుపవనాలు మే 26న ముందుగానే వస్తాయని అంచనా వేసినా ఆలస్యమైంది.
మరోవైపు ఎల్ నినో ముప్పు తీవ్రంగా పొంచి ఉంది. జూన్లో ఒక బలహీనమైన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని, ఇది రుతుపవన కాలమంతా వర్షపాత సరళిని ప్రభావితం చేయగలదని ఐఎండీ చెబుతోంది. రుతుపవనాల రాకకు అవసరమైన పశ్చిమ గాలులు బలపడటాన్ని లక్షద్వీప్పై ఉన్న ఒక తుఫాను వలయం ప్రస్తుతం ప్రభావితం చేస్తోందని ఐఎండీ డైరెక్టర్ నీతా కె గోపాల్ తెలిపారు. అయితే, దీని అర్థం రుతుపవనాలు ఆలస్యం అయ్యాయని కాదని ఆమె అన్నారు. ఇది ఆలస్యమైన రుతుపవనాలని మనం ఇంకా చెప్పలేమని, సాధారణ సమయంలోనే వస్తుందని అంచనా అన్నారు. జూన్ 8 తర్వాత రుతుపవనాల రాక జరిగితేనే దానిని ఆలస్యం అయినట్లుగా పరిగణిస్తామన్నారు.

వచ్చే నెల రోజుల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. బలహీనమైన పశ్చిమ గాలుల కారణంగా కేరళలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ప్రస్తుతం రుతుపవనాల వంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని నీతా తెలిపారు.
ఇవి రుతుపవనాల పురోగతికి సంబంధించిన ముందస్తు పరిస్థితులు అన్నారు. తుఫాను వ్యవస్థ కదిలిన తర్వాత తీరప్రాంతంలో బలమైన పశ్చిమ గాలులు వీస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రెండు వారాల్లో సాధారణ వర్షపాతం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. కాలానుగుణ అంచనాల ప్రకారం, జూన్ నెలలో, మొత్తం నైరుతి రుతుపవన కాలంలో కేరళలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి అంచనా వేస్తోంది.

మరోవైపు జూన్ 3వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, జూన్ 8నాటికీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని దివిసీమ వెదర్ మ్యాన్ లంకేష్ వెల్లడించారు. జూన్ 13వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపారు.














Click it and Unblock the Notifications