దారుణంగా పడిపోయిన భారత్ ఇమేజ్- అమెరికన్లలో సగం- తాజా సర్వేలో షాకింగ్..!
తాజా పరిణామాల నేపథ్యంలో వివిధ దేశాల్లో భారత్ (India) ఇమేజ్ ఎలా ఉందనే దానిపై ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Centre) చేపట్టిన అధ్యయనంలో షాకింగ్ గణాంకాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా ఇతర దేశాలతో పోలిస్తే అమెరికన్లలో భారత్ ఇమేజ్ దారుణంగా పడిపోయినట్లు సర్వేలో (Survey) తేలింది. దీంతో పాటు ఇతర దేశాల్లో పరిస్ధితి ఎలా ఉందో కూడా ఈ సర్వేలో వెల్లడైంది. అమెరికా ప్రజలు భారత్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు ప్యూ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. అక్కడ సగం మంది ప్రజలు భారత్పై వ్యతిరేక దృక్పథాన్ని కలిగి ఉండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ నివేదిక ప్రకారం 45 శాతం మంది అమెరికన్లు (US) భారత్ను సానుకూలంగా చూస్తున్నప్పటికీ, 50 శాతం మంది ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్యూ రీసెర్చ్ 2008లో అమెరికన్ల అభిప్రాయాలను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి భారత్కు దక్కిన అత్యల్ప రేటింగ్లలో ఇది ఒకటి. వయసు, రాజకీయ సిద్ధాంతాల ఆధారంగా కూడా ఈ అభిప్రాయాలు మారుతున్నాయి. డెమొక్రాట్లు, వయసు పైబడిన వారు భారత్ పట్ల సానుకూలతను చూపిస్తుండగా, రిపబ్లికన్లు, యువతలో ఆ మొగ్గు తక్కువగా ఉంది. వివిధ దేశాలలో భారత్ పట్ల వైఖరి భిన్నంగా ఉంది. సర్వే జరిగిన 36 దేశాల్లో సగటున 45 శాతం మంది భారత్ పట్ల సానుకూల దృక్పథంతో ఉండగా, 41 శాతం మంది వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్ పొరుగు దేశాల విషయానికొస్తే, శ్రీలంక అత్యధికంగా 79 శాతం సానుకూలతతో ముందు వరుసలో నిలిచింది.

45% of Americans view India favorably, while 50% view it unfavorably.
— Pew Research Center (@pewresearch) August 17, 2026
These ratings are some of the lowest since 2008, when we began asking this question. pic.twitter.com/A1l6Rhm8XM
శ్రీలంకతో పోలిస్తే పొరుగునే ఉన్న పాకిస్థాన్లో కేవలం 7 శాతం మంది మాత్రమే భారత్ పట్ల సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో భారత్ ప్రతిష్ట వేగంగా క్షీణించింది. గతంలో 57 శాతంగా ఉన్న సానుకూలత ఈసారి ఏకంగా 42 శాతానికి పడిపోయింది. బ్రిటన్, కెన్యా దేశాల్లో భారత్ పట్ల అత్యధికంగా 71 శాతం సానుకూలత వ్యక్తమైంది. ఆసియాలోని ఇతర దేశాలైన జపాన్, థాయ్లాండ్లలో 55 శాతం మంది, సింగపూర్లో 51 శాతం మంది భారత్ వైపు మొగ్గారు. జర్మనీలో 63 శాతం, ఇటలీలో 56 శాతం మంది సానుకూల వైఖరిని ప్రదర్శించారు. టర్కీ వంటి దేశాల్లో కేవలం 15 శాతం మంది మాత్రమే భారత్కు మద్దతుగా నిలిచారు. అంతర్జాతీయంగా భారత్ శక్తిసామర్థ్యాలు పెరుగుతున్న తరుణంలో పొరుగు దేశాల నుంచి ఇలాంటి ఫలితాలు రావడం చర్చనీయాంశమవుతోంది.














Click it and Unblock the Notifications