పవర్ హాలిడే కొనసాగింపు - భారీగా విద్యుత్తును కొనుగోలు : సీఎం జగన్ కీలక నిర్ణయాలు..!!
ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అదనపు సామర్ధ్యాలను జోడించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ డిమాండ్-సప్లై, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీగా విద్యుత్తును కొనుగోలు చేశామని అధికారులు వివరించారు.
మార్చిలో 1268.69 మిలియన్ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని, ఏప్రిల్లో 1047.78 మిలియన్ యూనిట్లు రూ.1022.42 కోట్లతో కొన్నామని అధికారులు పేర్కొన్నారు. వీటీపీఎస్తోపాటు కృష్ణపట్నం యూనిట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. డీబీటీద్వారా ఉచిత విద్యుత్తు డబ్బు రైతుల ఖాతాల్లో వేస్తామని, నేరుగా రైతులే చెల్లిస్తారని, దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతులు ప్రశ్నించగలుగుతారని సీఎం అన్నారు.
మరోవైపు పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పవర్ హాలిడేను కొనసాగిస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ప్రాజెక్ట్ విజయవతం అయ్యిందని, 2020-21లో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 ఎం.యు. కరెంటు ఖర్చుకాగా, 2021- 2022లో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరినా 67.76 ఎం.యు. కరెంటు మాత్రమే వినియోగించారని అధికారులు తెలిపారు. 33.75 ఎం.యు. కరెంటు ఆదా అయ్యిందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలు..తాజాగా సింహాద్రి ఎన్టీసీపీలో గ్రిడ్ లో సాంకేతిక కారణాలతో ఉత్పత్తి నిలిచిపోవటంతో ముఖ్యమంత్రి పూర్తి వివరాలు సేకరించారు. విద్యుత్ కోతల పైన రాజకీయంగా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఇక, వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. అదే విధంగా పవర్ హాలిడే తొలుత ప్రకటించిన దాని కంటే మరి కొన్ని రోజులు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వం పైన మరిన్ని రాజకీయ విమర్శలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.